గుజరాత్ నుంచి రాజ్యసభ బరిలో జేపీ నడ్డా... తెలంగాణ నుంచి రేణుకా చౌదరి

ఠాగూర్

బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (16:47 IST)
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బరిలోకి దిగుతున్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ కూడా రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీ పోటీ చేసే అవకాశం కల్పించింది. దీంతో ఆయన మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇకపోతే, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయా పార్టీలు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించాయి. 
 
కాగా, ఈ రాజ్యసభ ఎన్నికల కోసం ఇప్పటికే 19 మంది అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ తాజాగా ఏడుగురితో మరో జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గుజరాత్‌ నుంచి బరిలో నిలిపింది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుండటంతో ఆయన్ను ఈసారి గుజరాత్‌ నుంచి నామినేట్‌ చేయాలని నిర్ణయించింది. అలాగే, కాంగ్రెస్‌ పార్టీని వీడి మంగళవారం భాజపాలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది.
 
వీరిద్దరితో పాటు రాజ్యసభ బరిలో గుజరాత్‌ నుంచి గోవింద్‌ భాయ్‌ ఢోలాకియా, మయాంక్‌ భాయ్‌ నాయక్‌, డా.జశ్వంత్‌ సిన్హ్‌ సలాంసిన్హ్‌ పర్మార్‌ ఉండగా.. మహరాష్ట్ర నుంచి మేధా కులకర్ణి, డా.అజిత్‌ గోప్చాడేలను ఎంపిక చేసింది. 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
 
మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, జి.సి.చంద్రశేఖర్‌, మధ్యప్రదేశ్‌ నుంచి అశోక్‌ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15వ తేదీ గురువారం వరకు గడువు వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు