పన్ను మినహాయింపులో మతలబు... పన్ను పరిమితి దాటితే బాదుడే...

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (19:31 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో వేతనజీవులకు గొప్ప ఊరటగా ఉంటుందన్నారు. 'ఆదాయపుపన్ను మినహాయింపు పరిమితి పెరుగుదల'లో మతలబు ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
ఈ ప్రకటనను పరిశీలిస్తే... పన్నుకు అర్హమైన సంవత్సరాదాయం రూ.5 లక్షల వరకు ఉంటే ఆదాయపుపన్ను చెల్లించవలసిన అవసరం లేదని పైకి కనిపిస్తున్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే అందులోని మతలబు బోధపడుతుందంటున్నారు.
 
ఆర్థికమంత్రి గోయల్ ప్రకటన ప్రకారం పన్నుకు అర్హమైన వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా పన్ను మినహాయింపు వస్తుంది. ఈ రూ.5 లక్షల పరిమితి దాటినట్లయితే ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను రేటు స్లాబ్ ప్రకారమే పన్ను వసూలు చేస్తారు. 
 
ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.6 లక్షలుగా ఉంటే, ఆపై లక్ష రూపాయలు మాత్రమే పన్నుకు అర్హమైన ఆదాయం అనుకుంటే పొరపాటు. అప్పుడు ప్రస్తుత స్లాబ్ ప్రకారం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వార్షికాదాయం వరకూ 5 శాతం పన్ను (రూ.12,500), ఆ పైన ఉన్న మిగిలిన లక్ష రూపాయల మొత్తానికి 20 శాతం (రూ.20,000) మొత్తం రూ.32,500 పన్ను చెల్లించాల్సి ఉంటుందని వారు వివరిస్తున్నారు. 
 
మొత్తంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఇప్పటికీ రూ.2.5 లక్షలుగానే ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు