శశికళ పాలిట సింహస్వప్నం... కర్ణాటక మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ బి.వి.ఆచార్య

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (08:14 IST)
జయలలిత అక్రమాస్తుల కేసు దేశంలోనే ఓ సంచలన కేసుగా రికార్డుపుటలకెక్కింది. ప్రస్తుత బీజీపీ నేత డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు డీఎంకే ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ వేసిన జయలలిత ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టుకున్నారంటూ కోర్టుకెక్కారు. ఆ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరకు బెంగుళూరుకు చేరింది. 
 
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసును బెంగుళూరుకు బదిలీ చేశారు. అక్కడ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసును విచారించిన జస్టీస్ కున్హా సుదీర్ఘంగా విచారణ జరిపి సంచలనాత్మక తీర్పును వెలువరించారు. ముద్దాయిలుగా తేలిన జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు నాలుగేళ్ళ జైలుశిక్షతో పాటు.. రూ.100 కోట్ల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
అయితే, ఈ కేసును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడే జయలలిత తప్పుచేశారు. హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఓ న్యాయ నిపుణుడు సలహా ఇచ్చారు. ఆయనే బీవీ ఆచార్య. ఆయన కర్ణాటక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ముక్కుసూటి మనిషి. జయ అక్రమాస్తుల కేసులో కర్ణాటక తరఫున వాదించి వారు జైలు ఊచలు లెక్కపెట్టేలా చేశారు. అప్పుడు తన వాదనాపటిమతో జయను జైలుకు పంపితే.. ఇప్పుడు శశికళ ఊచలు లెక్కపెట్టేలా చేశారు. 
 
ఈ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అప్పటికి ఆయన ఏజీగా పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ పాలిట ఆయన విలన్‌గా అవతరించారని కొందరు అభివర్ణిస్తున్నారు. 2004-2012 మధ్య ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన ఆచార్య వ్యక్తిగత కారణాలతో 2012లో పదవికి రాజీనామా చేశారు.

వెబ్దునియా పై చదవండి