బలపడుతున్న తేజ్ తుఫాను... తీవ్ర తుఫానుగా మారే అవకాశం

ఆదివారం, 22 అక్టోబరు 2023 (10:31 IST)
ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను క్రమంగా బలపడుతుంది. ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నానికి ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. పైగా, ఈ తుఫాను గుజరాత్ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 
 
ఈ తుఫానుకు తేజ్ అని నామకరణం చేశారు. ఈ అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నానికి మరింతగా బలపడి, తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది. ఇక ప్రస్తుతం తేజ్ తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు గరిష్ఠంగా 62 నుంచి 88 కి.మీ వేగంతో వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. ఈ గాలుల వేగం 89 - 117 కి.మీ.లకు చేరితే తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు.
 
కాగా.. ఈ తుఫాను గుజరాత్‌లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండడంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని లెక్కగట్టింది. అయితే తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దాని పక్కనే ఉన్న యెమెన్ దక్షిణ తీరాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దిశను మార్చుకునే అవకాశం కూడా ఉండడంతో ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు