కింది కోర్టేమో అలా.. పై కోర్టేమో ఇలా... న్యాయం ఇన్ని రకాలుగా ఉంటుందా?

శనివారం, 15 ఏప్రియల్ 2017 (08:19 IST)
నిన్న అన్యాయం, నేడు న్యాయం, నేటి న్యాయం రేపటి అన్యాయం.. మన దేశంలో న్యాయదీపం ఇలాగే కొట్టుమిట్టాడుతోంది. గోటితో పోయేదానికి గొడ్డలితో తెచ్చుకోవడం అంటే ఏమిటో అర్థం కావాలంటే కింది కోర్టునుంచి పైకోర్టుకు వెళ్లే క్రమంలో తీర్పే తారుమారైపోతున్న ఘటనలను చూస్తే చాలు. అత్యంత సున్నితమైన అంశాల పట్ల కూడా సెషన్స్ కోర్టుకు, మెజిస్ట్రీయల్ కోర్టుకు మధ్య అహగాహన పరంగా ఇన్ని తేడాలు ఉంటే న్యాయం ఎప్పుడు ఎవరికి అన్యాయంగా మారుతుందో.. అన్యాయం ఎప్పుడు న్యాయంగా రూపు మార్చుకుంటుందో అర్థం కాదు.
 
విషయానికి వస్తే..  భార్య చదువుకున్నంత మాత్రాన ఆమెకు ఇవ్వవలసిన మధ్యంతర జీవనభృతిని నిరాకరించడం కుదరదని ఢిల్లీలోని సెషన్స్‌కోర్టు తీర్పునిచ్చింది. గృహహింస కేసులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన అదనపు సెషన్స్‌ జడ్జీ వివేక్‌ గులియా, దిగువ మేజిస్ట్రియల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. మధ్యంతర భృతి పొందడానికి భార్య నిరాశ్రయురాలు కావాల్సిన అవసరం లేదన్నారు. భార్యకు నెలకు రూ.3,000 మధ్యంతర భృతి చెల్లించాల్సిందిగా ఆమె భర్తను ఆదేశించారు. 
 
అసలు సంగతి ఏమిటంటే, 2015 జనరిలో పిటిషనర్‌కు వివాహమైన తర్వాత అదనపు కట్నం తేవాల్సిందిగా ఆమెను భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. దీంతో పెళ్లైన అయిదు నెలలకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మధ్యంతర భృతి కోసం మేజిస్ట్రియల్‌ కోర్టును ఆశ్రయించగా,  పిటిషనర్‌కు తనను తాను పోషించుకోగల సామర్థ్యం ఉందని పటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె సెషన్స్‌కోర్టును ఆశ్రయించారు.
 
మేజిస్ట్రియల్‌ కోర్టు ఒక రకంగా, సెషన్స్ కోర్టు ఒకరకంగా చెప్పినందువల్లే న్యాయం ఇలా తలకిందులైపోయింది. ఇంతకంటే పై కోర్టుల్లో దీనిపై దావా వేస్తే ఇదే సమస్యపై అక్కడ ఎన్ని ట్విస్టులతో తీర్పు ప్రకటిస్తారో మరి.
 

వెబ్దునియా పై చదవండి