ప్రస్తుతం ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్-95) కింద నెలకు రూ.1000 కనీస పింఛను అందుతోంది. 2014లో నిర్ణయించిన ఈ మొత్తంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేదు. అయితే, తాజాగా ఈ కనీస పింఛనును రూ.2500కు పెంచేందుకు ఈపీఎఫీ సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, ఉద్యోగ సంఘాలు మాత్రం పింఛనును నెలకు రూ.7500కు పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నెల 10, 11 తేదీల్లో బెంగళూరులో జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (సీబీటీ) సమావేశంలో ఈ అంశం ప్రధాన ఎజెండాగా చర్చకు రానుంది. పింఛను పెంపుతో పాటు సంస్థ సేవలను డిజిటలైజ్ చేసే 'ఈపీఎఫ్ఎ 3.0' విధానం, ఇతర పరిపాలనా సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బెంగళూరు సమావేశంలో పింఛను పెంపునకు బోర్డు ఆమోదం తెలిపితే, తుది నిర్ణయం కోసం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాతే కొత్త పింఛను అమల్లోకి వస్తుంది. కాగా, కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసి 58 ఏళ్లు నిండిన ఉద్యోగులు ఈపీఎస్-95 కింద పింఛను పొందేందుకు అర్హులన్న విషయం తెలిసిందే.