గుడ్‌‍బై మై డియర్ లైట్‌హౌస్ : శంతను నాయుడు

ఠాగూర్

గురువారం, 10 అక్టోబరు 2024 (18:12 IST)
భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాట్ మృతి ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. అయితే, రతన్ టాటా చివరి దశలో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో శంతను నాయుడు ఒకరు. రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తితో ఆ యువకుడి స్నేహం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. టాటా ట్రస్ట్‌లో అత్యంత పిన్నవయస్కుడైన జనరల్ మేనేజరుగా, టాటాకు అత్యంత విశ్వాస పాత్రుడైన అసిస్టెంట్‌గా గుర్తింపు పొందారు. తన బాస్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టారు. గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్ అంటూ హెడ్డింగ్ పెట్టారు. 
 
"మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది. ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌బై మై డియర్ లైట్ హౌస్" అని ఈ 30 ఏళ్ల శంతను ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే ఇద్దరు కలిసిదిగిన ఒక పాత చిత్రాన్ని షేర్ చేశారు. శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. 80ల్లో ఉన్న టాటాకు.. ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. 
 
కాగా, శంతను నాయుడు స్నేహంపై 'గుడ్ ఫెల్లోస్' లాంచింగ్ కార్యక్రమంలో రతన్ టాటా మాట్లాడుతూ.. "ఒక తోడుంటే బాగుండు అని కోరుకుంటూ ఒంటరిగా సమయం గడిపేవరకూ.. ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలియదు" అని వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు మళ్లేవరకు.. వృద్ధాప్యం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరన్నారు. ప్రస్తుతం సహజ సత్సాంగత్యాన్ని పొందడం అత్యంత సవాలుగా ఉందని వెల్లడించారు. ఆ సందర్భంగా శంతను ఆలోచనా విధానాన్ని మెచ్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు