హర్యానాలోని జింద్ జిల్లాకు చెందిన ‘సోనాలి షోకండ్’ను హర్యానా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 11 వేల రూపాయల రివార్డుతో సత్కరించింది. ఈ అవార్డు వచ్చినందుకు సోనాలి కుటుంబం, తోటి గ్రామస్తులు మెచ్చుకోకపోగా ఈసడించుకున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. పంట నూర్పిడి తర్వాత మిగిలిపోయిన చెత్తనంతా తగలబెట్టటం సోనాలి తండ్రికి అలవాటు.
అది అతను ప్రతి ఏటా చేసే పనే. అయితే తగలబెట్టటం వల్ల రేగే పొగతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని తెలుసుకున్న సోనాలి తండ్రిని వారించింది. వినకపోతే ఏకంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకే ఫిర్యాదు చేసింది. దాంతో వాళ్లు సోనాలి తండ్రికి 2,500 ఫైన్ వేశారు. కన్న కూతురే తన మీద ఫిర్యాదు చేయటంతో నొచ్చుకున్న సోనాలి తండ్రి ఆమెతో మాట్లాడటం మానేశాడు. కుటుంబమంతా ఆమెను ఆడిపోసుకున్నారు. అయినప్పటికీ ఆ యువతి మాత్రం ధైర్యంతో ముందుకు సాగిపోతోంది.