ఎన్నికల్లో ఓడిపోతే పెళ్లాడతా : మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిలా

గురువారం, 11 ఆగస్టు 2016 (14:52 IST)
మణిపూర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న సైనిక బలగాల ప్రత్యేక అధికార చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 సంవత్సరాల పాటు దీక్ష చేసిన ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిలా తాజాగా ఆమె చేపట్టిన దీక్షను విరమించి.. రాజకీయాల్లోకి రానున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తానని ప్రటించారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం తాను పెళ్లి చేసుకుని స్థిరపడిపోతానని తెలిపారు. 
 
ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిలా 16 ఏళ్లపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షను ఆగస్టు 9వ తేదీతో ముగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి అవుతానని తెలిపారు. తాను దీక్ష విరమించినా ఈశాన్య రాష్ట్రాల్లో చట్టాన్ని పూర్తిగా తొలగించే వరకు గోళ్లు కత్తిరించుకోనని, తల దువ్వుకోనని, ఇంటికి వెళ్లి తల్లితో మాట్లాడనని ఇరోమ్‌ షర్మిలా స్పష్టం చేశారు.
 
తాను తౌబల్‌ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరిస్తే అప్పుడు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోతానని షర్మిలా వెల్లడించారు. అంతేకాదు... తన కొత్త వ్యూహం ప్రజలకు అర్థం కాకపోయినా, తనను వారు అవమానించినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి తెర తీస్తుందని ఆమె అన్నారు.
 
మరోవైపు షర్మిలా దీక్ష విరమణపై కొన్ని మణిపూర్‌ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఆమెకు మాయమాటలు చెప్పి రాజకీయాల్లోకి లాగాయని ఆరోపించాయి. అందుకే షర్మిలా దీక్ష విరమించారని మండిపడుతున్నాయి. దీంతో షర్మిలా చికిత్స పొందుతున్న ఇంఫాల్‌ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి