భారత్‌లో అంతర్భాగం కాశ్మీర్‌... పాకిస్థాన్ వల్లే హింస : రాహుల్

బుధవారం, 28 ఆగస్టు 2019 (15:24 IST)
కాశ్మీర్ లోయ భారత్‌లో అంతర్భాగమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అయితే, కాశ్మీర్ లోయలో చెలరేగే హింసకు కారణం పాకిస్థాన్ అని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, కాశ్మీర్‌లో ఉన్న అనేక అంశాల్లో కేంద్ర ప్ర‌భుత్వంతో విబేధిస్తాన‌ని, కానీ ఈ స‌మ‌యంలో ఒక అంశాన్ని స్ప‌ష్టం చేయాల‌నుకుంటున్న‌ట్లు రాహుల్ చెప్పారు. 
 
కాశ్మీర్ స‌మ‌స్య భార‌త్ అంత‌ర్గ‌త‌మ‌ని, పాకిస్థాన్ లేదా ఇత‌ర దేశాల‌కు ఈ అంశంలో జోక్యం చేసుకునే అవ‌కాశం లేద‌న్నారు. జ‌మ్మూకాశ్మీర్‌లో హింస చెల‌రేగుతోంద‌ని, పాకిస్థాన్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల‌, రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల అక్క‌డ ఈ పరిస్థితి త‌లెత్తింద‌ని రాహుల్ అన్నారు. ప్ర‌పంచ దేశాల్లో ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషిస్తోంద‌ని పాకిస్థానే అన్న అభిప్రాయాన్ని రాహుల్ త‌న ట్వీట్‌లో వినిపించారు.
 
మరోవైపు, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ సర్కారు రద్దు చేయగా, ఈ అంశాన్ని అంతర్జాతీయంగా వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్ చేయరాని ప్రయత్నమంటూ లేదు. ఇదే అంశంపై ఐక్యరాజ్య సమితికి కూడా లేఖ రాసింది. ఇందులోకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా లాగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
పలువురు ఐక్యరాజ్యసమితి అధికారులకు అందించిన ఈ లేఖను పాకిస్థాన్ మానవహక్కుల మంత్రి షిరీన్ మజారీ మంగళవారం విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను లేఖలో పేర్కొన్నారు. "జమ్మూ కశ్మీర్ లో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్‌కు చెందిన కీలక రాజకీయ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు చనిపోతున్నారని, పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు' అని లేఖలో పాకిస్థాన్ గుర్తు చేసింది. అలాగే, జేకేకు చెందిన మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా పేర్లను కూడా పాకిస్థాన్ ఉటంకించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు