పిల్ల అందంగా ఉందనీ.. ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకుంటే....

మంగళవారం, 10 మార్చి 2020 (07:55 IST)
ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల పాటు చక్కగానే సంసారం చేసిన ఆ కోడలు.. చివరకు అత్తింటికి కన్నం వేసింది. అత్తగారి ఇంట్లో ఉన్న బంగారు నగలు, డబ్బుతో పారిపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ జిల్లా గుడ్లీ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేశ్ సేథియా అనే యువకుడు ఇండోర్ అమ్మాయి స్వప్నను పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి చాలా అందంగా ఉండటంతో రూ.5 లక్షల ఎదురుకట్నమిచ్చిమరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంబంధాన్ని ఓ పెళ్లిళ్ళ పేరయ్య కుదిర్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. 
 
వివాహం జరిగిన తర్వాత శోభనం రాత్రిని తూతూమంత్రంగా ముగించిన ఆ యువతి... ఆ తర్వాత భర్త పట్ల విముఖత చూపిస్తూ వచ్చింది. కానీ, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులతో ప్రేమగా మసలుకుంటూ వచ్చింది. అదేసమయంలో ఆమె రహస్యంగా చాటింగ్ చేస్తున్న విషయాన్ని భర్త గమనించి.. చూసీచూడనట్టుగా వ్యవహరించాడు. 
 
ఆ తర్వాత ఒక రోజున.. పెళ్లయిన కొన్నివారాల తర్వాత ఉన్నట్టుండి స్వప్న మాయమైంది. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో హడలిపోయిన ముఖేశ్ చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దర్యాప్తు షురూ చేసిన పోలీసులు దిమ్మదిరిగే వాస్తవాలు తెలుసుకున్నారు. స్వప్న ఓ ముఠాలో సభ్యురాలని, సంపన్నుల బిడ్డలకు వలవేసి వారిని పెళ్లి ఉచ్చులో దింపి, అందినకాడికి దోచుకుని ఉడాయించడం ఆమె నైజమని గుర్తించారు. 
 
స్వప్న బారినపడింది ముఖేశ్ ఒక్కడే కాదట... ముఖేశ్ కంటే ముందు అనేకమందిని ముంచిన ఘనురాలు స్వప్న అని పోలీసులు వెల్లడించారు. దీంతో సప్నతో పాటు.. ఆమె ముఠా సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు