మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి.. శిష్యుడు అరెస్టు

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (13:55 IST)
అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)లోని బాఘంబరి మఠంలోని అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనిపించింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన శిష్యులు ఫోన్‌ చేయడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ గదిలో 8 పేజీల లేఖ ఒకటి లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె.పి.సింగ్‌ వెల్లడించారు. 
 
మానసికంగా తీవ్ర కలతకు గురైన తాను జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసి ఉందన్నారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా.. పలు అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. నరేంద్రకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఆనంద్‌ గిరి అనే శిష్యుడు.. గతంలో ఆశ్రమంలో మోసాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిని ఆశ్రమం నుంచి బయటకు పంపేశారు. 
 
అయితే కొన్ని రోజుల తర్వాత ఆనంద్ గిరి మళ్లీ నరేంద్ర వద్దకు వచ్చి క్షమించమని కోరడంతో తిరిగి ఆశ్రమంలో చేర్చుకున్నట్లు తెలిసింది.
 
కాగా, నరేంద్ర గిరిని ఆనంద్‌ పలుమార్లు వేధించాడని ఆశ్రమంలోని కొందరు పోలీసులకు తెలిపారు. ఆయన మరణించిన గది ముందు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దీని ఆధారంగా ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
 
మరోవైపు నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతిపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు