పంతానికి పచ్చజెండా :: నందిగ్రామ్ నుంచే బరిలోకి.. దమ్ముంటే కాస్కోండి!

శుక్రవారం, 5 మార్చి 2021 (15:30 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేసే స్థానంపై ఓ క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్టుగానే ఆమె పంతానికి పచ్చజెండా ఊపారు. నందిగ్రామ్ నుంచే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 
 
త్వరలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి. అయితే, అధికార టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆమె ఇప్పటివరకు భవానీపూర్ నుంచే బరిలోకి దిగుతూ వచ్చారు. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడానికి ఈసారి మాత్రం ఆమె నందిగ్రామ్‌ను ఎంచుకున్నారు. 
 
ఇటీవలే బీజేపీలో చేరిన స్ట్రాంగ్ మ్యాన్ సుబేందును, బీజేపీని రాజకీయంగా ఎదుర్కోడానికి ఈసారి ఆమె నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ పోటీకి దిగుతున్నారు. 
 
మరోవైపు 294 స్థానాలకు గాను ఆమె అభ్యర్థులను ప్రకటించారు. అందరూ 80 సంవత్సరాల లోపు వయస్సు వారే. అందులో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది షెడ్యూల్ కులాలు, 17 మంది షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థులు ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు