అన్న అప్పు చెల్లించలేదని చెల్లెలిపై రెండేళ్ళ పాటు వడ్డీ వ్యాపారి అఘాయిత్యం

శుక్రవారం, 31 జనవరి 2020 (22:35 IST)
తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వడ్డీ వ్యాపారి అతని చెల్లెలిపై రెండేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన తారకనాథ్‌ చాలా ఏళ్ల క్రితం భార్యతో కలసి బెంగళూరు నగరానికి వచ్చి హుళిమావులో స్థిరపడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన తారకనాథ్‌ నష్టపోయాడు. దీంతో స్థానిక వడ్డీ వ్యాపారి బాలాజీ వద్ద 6 లక్షలు అప్పుతీసుకున్నాడు. వాటితో మళ్లీ పెట్టుబడి పెట్టినా నష్టాలు తప్పలేదు. దీంతో అప్పు చెల్లించలేకపోయాడు. 
 
అప్పు చెల్లించాలంటూ బాలాజీ తరచూ తారకనాథ్‌ ఇంటికి వచ్చి బెదిరించేవాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తారకనాథ్‌ చెల్లెలు ఉద్యోగం కోసం బెంగళూరు నగరానికి వచ్చి అన్న తారకనాథ్‌ ఇంట్లోనే ఉండేది. అప్పు చెల్లించాలంటూ తరచూ ఇంటికి వస్తున్న బాలాజీ తారకనాథ్‌ చెల్లెలిని చూసి ఆమెను లొంగదీసుకోవడానికి కుట్ర పన్నాడు. ప్రతీరోజూ తారకనాథ్‌ ఇంటికి రావడం మొదలుపెట్టిన బాలాజీ అప్పు చెల్లించాలంటూ తారకనాథ్‌ చెల్లెలిని లైంగికంగా వేధించసాగాడు. 
 
అంతే కాకుండా ఆమెను బెదిరిస్తూ పలుమార్లు అకృత్యాలకు పాల్పడ్డాడు. బాధితురాలు రెండేళ్లుగా మౌనంగా భరిస్తూ వచ్చింది. దీన్ని అలుసుగా తీసుకున్న బాలాజీ మరింత రెచ్చిపోయాడు. వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు