కాషాయ కండువా కప్పుకోనున్న మెట్రో‌మేన్ శ్రీధరన్

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (13:54 IST)
దేశంలో మెట్రో‌మేన్‌గా పేరు సంపాదించుకున్న శ్రీధరన్ రాజకీయ నేతగా మారనున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. 88 యేళ్ళ శ్రీధరన్.. ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టుతో పాటు దేశంలోని పలు ప్రాజెక్టులన వెనుక ఉన్న ఇంజినీరింగ్ లెజెండ్‌గా ఖ్యాతిగడించారు. ఈయన ఇపుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 
 
వచ్చే మే నెలలో దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితో పాటు.. వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆదివారం నుంచి కేరళలో విజయయాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది.  ఈ సందర్భంగా 88 ఏళ్ల శ్రీధరన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. కొన్ని అధికారికమైన ఫార్మాలిటీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి" అని ఈ సందర్భంగా శ్రీధరన్ చెప్పారు. దేశానికి బీజేపీ చేస్తున్న సేవలు చాలా గొప్పవని... బీజేపీని ఇతర జాతీయ పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తుండటం సరికాదని... విపక్షాల ధోరణిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. పార్టీ కోరితే ఎన్నిల్లో పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. 
 
తన సమయాన్ని, అనుభవాన్ని ఇకపై మరో విధంగా (రాజకీయాల ద్వారా ప్రజా సేవ) వినియోగించాలని అనుకుంటున్నాను అని చెప్పారు. 2011లో ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్ రిటైర్ అయ్యారు. శ్రీధరన్‌ను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీతో, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు