ఆర్మీ అధికారికే ఈ దుస్థితి.. ఇక సామాన్యుల సంగతేంటి?

గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:56 IST)
దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా బారినపడ్డ రిటైర్డ్ బ్రిగేడియర్ రష్ పాల్ సింగ్‌ను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. 
 
కానీ ఏ ఆసుపత్రిలోనూ బెడ్లు ఖాళీ లేవు. చివరికి ఆర్మీ బేస్ హాస్పిటల్, డీఆర్డీవో ఆసుపత్రుల్లోనూ బెడ్లు లేవు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చుకోలేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. ఆయనను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. ఈ క్రమంలో మరోదారి లేక ఢిల్లీ నుంచి ఛండీఘర్‌కి తీసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు విడిచారు. రష్ పాల్ సింగ్ ఢిల్లీలోని పశ్చిమ విహార్ లో నివాసం ఉంటున్నారు.
 
"ఆర్మీ బేస్ హాస్పిటల్‌లో అడ్మిషన్‌కి నిరాకరించిన తర్వాత కుటుంబసభ్యులు సింగ్‌ను ఎయిర్ పోర్టు సమీపంలోని డీఆర్డీవో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ చూపించినా అక్కడ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా చేతులెత్తేశాయి" అని లెఫ్టినెంట్ కల్నల్ సోహి చెప్పారు.
 
ఢిల్లీలో ఎక్కడా బెడ్లు దొరక్కపోవడంతో కుటుంబసభ్యులు సింగ్‌కు ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ప్రాణవాయువు అందించారు. అలాగే ఛండీఘర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ లాభం లేకపోయింది. ఆసుపత్రికి చేరేలోపే, వైద్యం అందే లోపే ఆయన మరణించారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ కల్నల్ సాహి ఫైర్ అయ్యారు. ఇది షాకింగ్ ఘటన అంటూ మండిపడ్డారు. 
 
"మాజీ ఆర్మీ అధికారికే ఆసుపత్రిలో బెడ్ దొరక్కపోవవడం, వైద్యం కోసం అటు తిటూ తిరగడం బాధాకరం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సింగ్‌ను మిలటరీ ఆసుపత్రులు కచ్చితంగా అడ్మిట్ చేసుకుని ఉండాల్సింది. సాధారణ పౌరులను చేర్చుకోవడం వారికి ట్రీట్ మెంట్ ఇవ్వడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మాజీ సైనికి ఉద్యోగులను ఇలా వదిలేయండం కరెక్ట్ కాదు" అని కల్నల్ సాహి అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు