ఇపుడున్న గ్యాస్ ధరతో అపుడు 2 సిలిండర్లు వచ్చేవి : రాహుల్

ఆదివారం, 8 మే 2022 (15:40 IST)
ఇపుడున్న గ్యాస్ ధరలతో అపుడు రెండు సిలిండర్లు వచ్చేవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాజాగా గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50 మేరకు పెంచింది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 50 రూపాయలు పెంచడం గమనార్హం. 
 
ఇక ఈ నెల 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.102 పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2355.50కు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్లే గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 2021 నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌పై రూ.190 పెరగడం గమనార్హం. ఈ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే గ్యాస్ ధరలు రెండింతలయ్యాయని విమర్శించారు. 
 
"ఇపుడున్న గ్యాస్ ధరతో 2014లో రెండు సిలిండర్లు వచ్చేవి. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక్క గ్యాస్ ధర రూ.410. సబ్సీడీగా రూ.827 ఇచ్చేవాళ్లం. కానీ, ఇపుడు గ్యాస్ ధర రూ.1000 అయింది. సబ్సీడీగా సున్నా ఇస్తున్నారు" అంటూ మండిపడ్డారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాహుల్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు