కరోనా కల్లోలం.. చైనా ఆర్డర్లన్నీ భారత్‌కు.. రోజాకు డిమాండ్ (video)

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (12:39 IST)
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్ సహా 20 ప్రపంచ దేశాలకు ఈ వైరస్ విస్తరించింది. ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చైనా తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు, కరోనా వైరస్ ఎఫెక్టు చైనా దిగుమతులపై కూడా స్పష్టంగా పడింది. ముఖ్యా చైనా రోజా పువ్వులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అయితే, కరోనా వైరస్ కారణంగా చైనా రోజాపూలను దిగుమతి చేసుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. దీంతో భారత్‌ రోజా పువ్వులకు ఒక్కసారి డిమాండ్ పెరిగిపోయింది. 
 
ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరు రైతుల దశ తిరిగిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు ఆ దేశం నుంచి వివిధ రకాల కాయగూరలు, పూలు, పండ్లను దిగుమతి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో భారత్‌ నుంచి పూలు, పళ్ళు, కూరగాయల దిగుమతికి మక్కువ చూపుతున్నారు. ఈనేపపథ్యంలో లిటిల్‌ ఇంగ్లండుగా పేరొందిన హోసూరు ప్రాంతంలో పండే పూలకు ఆర్డుర్లు వెల్లువెత్తుతున్నాయి.
 
ముఖ్యంగా గ్రీన్‌హౌస్, ఔట్‌ఫీల్డ్‌లో సుమారు 2000 ఎకరాలకు పైగా రోజా పంటను పండిస్తున్నారు. ప్రతిసంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలైంటెన్స్‌డే కోసం దాదాపు ఒక కోటి పూలను ఎగుమతి చేస్తుంటారు. తాజ్‌మహల్‌, నోబల్స్‌, ప్రస్ట్‌రైట్‌, గ్రాంట్‌కాలా, పింక్‌, అవలాంజ్‌ తదితర 35 రకాలకు చెందిన పూలను హోసూరు ప్రాంతంలో సాగుబడి చేస్తుంటారు. వీటిని సింగపూర్‌, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 
 
అయితే, కరోనా వైరస్ దెబ్బకు ఒక్కో గులాబి పువ్వు ధర రూ.15 పలుకుతోంది. ఈ సంవత్సరం మంచు ప్రభావం, ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి తగ్గిందని పలువురు పూల ఎగుమతిదారులు చెప్పారు. ఏదేమైనప్పటికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరం వాలైంటెన్స్‌డేకి పూలను వివిధ దేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవాలని వ్యాపారులు భావిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు