అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ క్యాంపు నుంచి సీఎంగా ఎంపికైన పళని స్వామికి కష్టాలు మొదలయ్యాయి. బల పరీక్షకు శనివారం ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో శశికళ వర్గంలో ముసలం నెలకొంది. బలపరీక్షకు ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటికే అన్నాడీఎంకే కార్యదర్శిగా శశికళ పన్నీరుపై వేటు వేసిన నేపథ్యంలో.. పన్నీరు వర్గం పార్టీ చీఫ్ మధుసూదన్ కూడా శశికళ, దినకరన్, వెంకటేష్లపై వేటు వేశారు. ఇంకా శశికళ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జయమ్మ సర్కారు ప్రస్తుతం తమిళనాట లేదని.. చిన్నమ్మ సర్కారే ఉందని.. పన్నీరు ఇప్పటికే వ్యాఖ్యానించారు.
అమ్మ సమాధి సాక్షిగా చిన్నమ్మ కుటుంబం చేతికి పోయిన సర్కారును కూల్చేస్తానని శపథం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు సైతం శశికళ సర్కారును ఇంటికి పంపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో పన్నీర్ మద్దతు దారులు జల్లికట్టు తరహా ఉద్యమానికి పిలుపు నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. శనివారం (ఫిబ్రవరి 18) నాటి బలపరీక్ష అంత సులువు కాదని తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్స్లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 40 మంది సభ్యులు సీఎం పళనిస్వామికి ఎదురుతిరిగినట్లు తెలియవచ్చింది. దీంతో తంబిదురై రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గురువారం ఎమ్మెల్యేలందరూ రాజ్భవన్కు వచ్చి వెళ్లినప్పుడు ప్రజలు వాళ్ల వాహనాలపై ఉమ్మేయడంతో పాటు, బూతులు తిట్టారు. అది ఇప్పుడు రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో కొత్తగా 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలలో ఒక్కసారిగా భయం నెలకొంది.