పెద్ద నోట్ల రద్దుపై రాజ్యసభలో గురువారం వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఈ చర్చను తొలుత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఆ పేర్కొనడాన్ని సమాజ్వాదీ ఎంపీ నరేశ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు తనను కొంతమంది బతకనివ్వకపోవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని ప్రధాని మోడీ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సాక్షాత్ ప్రధానికే ప్రాణభయం ఉంటే.. దేశాన్ని ఎవరూ కాపాడుతారని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలే కష్టాలు పడుతున్నారని, బ్యాంకుల ముందు క్యూలైన్లలో కోటీశ్వరులు ఎవరైనా నిలబడ్డరా కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్టయిందని విమర్శించారు.
ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి నివేదికలు అందాయని, కానీ ఆ తర్వాత ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్దనోట్లను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో పెద్దనోట్ల రద్దులాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే లోక్సభ, రాజ్యసభ అనుమతి తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్.బి.ఐలో విజయ్ మాల్యాలాంటి పెద్దలకు రూ.7 వేల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనాన్ని ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించారు. కనీసం ఆర్థకమంత్రి జైట్లీని సైతం విశ్వాసంలోకి తీసుకోకుండా పెద్దనోట్ల రద్దును ప్రకటించారని విమర్శించారు.