తమిళనాడులో బీజేపీలో 15 మంది మాజీ ఎమ్మెల్యేల చేరిక

ఠాగూర్

బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (18:38 IST)
లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపునిచ్చే కార్యక్రమం జరిగింది. అన్నాడీఎంకేకు చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్. మురుగన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో ఢిల్లీలో వారు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరలు సమావేశంలో అన్నామలై అన్నారు. 
 
ఈ నేతలు బీజేపీలో చేరడంతో తమిళనాడులో తమకు సీనియర్ నాయకత్వం దొరికిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీని బలోపేతం చేసేందుకు వీరు తమతో కలిశారన్నారు. తమిళనాడులో బీజేపీ బలంగా దూసుకెళుతుందన్నారు. తమిళనాడు ప్రజలు బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడులో ఇంతమంది నాయకులు బీజేపీలో చేరడం  ప్రధాని మోడీకి దక్షిణాదిన ఉన్న ఆదరణకు నిదర్శమన్నారు. 
 
ముఖ్యంగా తమిళనాడులో బీజేపీకి పెద్దగా బలం లేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇక్కడ క్రమంగా బీజేపీ పెరుగుతోందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఎంపీ సీట్లు గెలుచుకుంటామని జోస్యంచెప్పారు. గత పదేళ్లుగా జరుగుతోన్న అభివృద్ధి కొనసాగాలని దేశంలోని ప్రతి పౌరుడు భావిస్తున్నాడన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు