తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోంది. క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు) ప్రైవేట్ రూంకు మార్చనున్నట్టు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి పొన్నయ్యన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... జయలలితకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వివరించారు.
గతవారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత కారణంగానే ఆమె దాదాపు 18 రోజుల పాటు జ్వరంతో బాధపడ్డారని పొన్నియన్ తెలిపారు. తగిన చికిత్స తర్వాత జ్వరం తగ్గిందని, ఆ తర్వాత బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలే, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, అపోలో వైద్యులు అంతా కలిసి అమ్మను సాధారణ స్థితికి దగ్గరగా తీసుకొచ్చారని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్తో జయలలితను (68) సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆమెకు కొంత ఇన్ఫెక్షన్ ఉన్నందున ఇప్పటికీ కృత్రిమ శ్వాసను ఇస్తున్నామని, అందువల్ల మరికొంత కాలం పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు.