ట్రాఫిక్ సమస్య... లోకల్ రైలులో ప్రయాణించిన ముంబై బిలియనీర్.. వీడియో వైరల్

ఆదివారం, 31 డిశెంబరు 2023 (11:57 IST)
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ కారణంగా వాహనచోదకులకు గంటల కొద్దీ సమయం వృధా అయిపోతుంది. ముఖ్యంగా, పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లకు క్షణం సమయం కూడా ఎంతో అమూల్యమైనది. ఇలాంటి వారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నపుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తాజాగా దేశ రియల్ ఎస్టేట్ దిగ్గజమైన బిలియనీర్ నిరంజన్ హిరానందానీ ముంబైలో లోకల్ రైలులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 
 
హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన 73 ఏళ్ల హీరానందానీ శుక్రవారం తన రైలు ప్రయాణం వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాం పై వేచి ఉన్న హీరానందానీ ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ రైలు ప్రయాణంలో ఆయనతోపాటు అతని బృందంలోని కొందరు సభ్యులు వెంట ఉన్నారు. తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ట్రాఫిక్ అవరోధాలను అధిగమించడానికి లోకల్ రైలులో ప్రయాణించానని ఆయన పేర్కొన్నారు.
 
హీరానందానీ షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో 22 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ప్రజారవాణా అయిన లోకల్ రైలులో ప్రయాణించినందుకు బిలియనీరు నెటిజన్లు ప్రశంసించారు. దేశానికి మీలాంటి వారు చాలామంది కావాలి అని ఓ నెటిజన్ కోరారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒక వ్యక్తిగా కలవాలని కోరుకుంటున్నాను సార్ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు