ఇకపై తిరుపతి లడ్డు చేదు : ధర అమాంతం రెట్టింపు (video)

బుధవారం, 13 నవంబరు 2019 (09:35 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ప్రసాదం స్వీకరించకుండా కొండ దిగడు. అవసరమైతే 10 రూపాయలు ఎక్కువైనా సరే లడ్డూను కొనుక్కుని వస్తాడు. అలాంటి శ్రీవారి ప్రసాదం ఇపుడు చేదైంది. ఎందుకంటే.. శ్రీవారి లడ్డూ ధరను తితిదే పాలకమండలి అమాంతం పెంచేసింది. 
 
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు (నడక భక్తులకు) ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. మరో రెండు లడ్డూలను రూ.25 చొప్పున కొనుగోలు చేయవచ్చు. ధర్మదర్శనం భక్తులకు రూ.20పై రెండు లడ్డూలు ఇస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఒక్కో టికెట్ పై 2 లడ్డూలు, అదనంగా 2 లడ్డూలను రూ.25పై కొనుగోలు చేసే సదుపాయం ఉంది. 
 
అయితే, మార్కెట్ ధర ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి రూ.40 వరకూ ఖర్చు అవుతుండగా, రాయితీ భారం తడిసి మోపెడు అవుతోందన్న ఉద్దేశంలో ఉన్న టీటీడీ, ఇకపై ఒక్కో లడ్డూను రూ.50కి విక్రయించాలని భావిస్తోంది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక చిన్న లడ్డూను ఉచితంగా ఇవ్వాలని, ఆపై లడ్డూ కావాలంటే రూ.50 పెట్టి కొనుక్కునేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
 
ఈ మేరకు తితిదే బోర్డు సమావేశంలో అదనపు ఈఓ ధర్మారెడ్డి, అధికారులతో సమీక్షించి, లడ్డూ ధరల పెంపు విధివిధానాలపై చర్చించారు. ధరల పెంపునకు బోర్డు సభ్యులు అందరూ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, లడ్డూలను రాయితీపై ఇవ్వడం వల్ల గత సంవత్సరం టీటీడీకి రూ.240 కోట్లకు పైగా నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు