ఆరుతో ముగిసిన భారత్ పోరు... నేటితో పారిస్ ఒలింపిక్స్ పోటీలు

ఠాగూర్

ఆదివారం, 11 ఆగస్టు 2024 (09:18 IST)
పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో భారత్ పోరు ముగిసింది. ఆరు పతకాలతో సరిపుచ్చుకుంది. శనివారం రెజ్లర్ రితికా హుడా మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. ఖచ్చితంగా పతకం సాదిస్తుందని ప్రతి ఒక్కరూ ఆశలుపెట్టుకోగా, ఆమె అనూహ్యంగా మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ 2024 పోటీల్లో భారత్ ప్రస్థానం బంగారు పతకం లేకుండానే ముగిసింది. 
 
ఒక రజతం, ఐదు కాంస్యాలు మాత్రమే సాధించడంతో పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. అయితే చివరి రోజైన ఆదివారం పలు ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. అన్ని క్రీడలు పూర్తయ్యే సరికి భారత్ స్థానం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాగా 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్ భారత్ 7 పతకాలను సాధించిన విషయం తెలిసిందే.
 
కాగా పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఆదివారం ముగియనున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు, మహిళల 50 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రజత పతకం కోసం చేసుకున్న అప్పీల్ ప్రస్తుతం పెండింగ్లో ఉంది. 
 
సెమీ ఫైనల్లో విజయం సాధించిన ఆమె.. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో ఫైనల్ ఆడకుండా అనర్హత వేటు వేశారు. దీంతో రజతం కోసం అప్పీల్ చేయగా.. ఈ విషయం ప్రస్తుతం సీఏఎస్ (కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్) పరిధిలో ఉంది. ఆగస్టు 13వ తేదీన నిర్ణయం వెలువడనుంది. 
 
కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్ల వివరాలను పరిశీలిస్తే, 
1. మను భాకర్ - కాంస్యం (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్)
2. మను భాకర్ - సర్బో జ్యోత్ సింగ్ - కాంస్యం (మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్)
3. స్వప్నిల్ కుసలే - కాంస్యం (పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్)
4. హాకీ జట్టు - కాంస్యం (పురుషుల ఫీల్డ్ హాకీ జట్టు), ఆగస్టు 8
5. నీరజ్ చోప్రా - రజతం (పురుషుల జావెలిన్ త్రో)
6. అమన్ సెహ్రావత్ - కాంస్యం (పురుషుల 57 కేజీల రెజ్లింగ్)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు