ఆస్తిపన్ను చెల్లించని వారిపై కొరఢా - రూ.200 ఆస్తులను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

ఠాగూర్

శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:34 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఇంటి యజమానుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఆస్తిపన్ను చెల్లించని ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించింది. మొండి బకాయిదారులపై కొరఢా ఝుళిపించే చర్యల్లో భాగంగా, ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31వ తేదీలోపు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఆస్తి పన్నులను చెల్లించాలని లేనిపక్షంలో ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. 
 
కాగా, మార్చి 31వ తేదీలోపు రూ.2 వేల కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటివరకు రూ.1500 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. టార్గెట్ చేరుకోవడానికి రూ.6 లక్షలకు పైగా బకాయిలు ఉన్న వారికి డిస్ట్రెస్ వారెంట్ నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ పన్ను వసూళ్లను రాబడుతున్నారు. 
 
నివాస భవనాల పేరుతో అనుమతులు తీసుకుని వాణిజ్య భవనాలుగా మార్చి వ్యాపార భవనాలుగా ఉపయోగిస్తున్న యజమానులపై ప్రత్యేక దృష్టిసారించినట్టు అధికారులు తెలిపారు. పన్ను తప్పించుకునేందుకు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారికి భారీ మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. 
 
కాగా, జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను బకాయిపడిన వాటిలో పలు ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. పన్ను చెల్లించని రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన బల్దియా... పన్ను ఎగవేతదారులపై కూడా ప్రత్యేక దృష్టిసారించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు