హైదరాబాద్ ప్రయాణికులపై ప్రయాణం భారం... ప్రయాణ సమయంలోనూ...

ఠాగూర్

శుక్రవారం, 2 మే 2025 (09:16 IST)
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య ఏక్షణమైనా యుద్దం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేసమయంలో ఇరు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమ గగనతలంలోకి భారత విమానాలు ప్రవేశించకుండా పాకిస్థాన్ నిషేధం విధించింది. భారత్ కూడా ఇలాంటి చర్యలనే చేపట్టింది. దీంతో పశ్చిమాసియా దేశాలకు వెళ్లాలంటే సుధీర్ఘ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ప్రయాణ చార్జీలు కూడా కూడా పెరిగాయి. ఈ భారాన్ని ప్రయాణికులపైనే వేస్తున్నారు. దీంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులపాటు తప్పదని విమాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా హైదరాబాద్ నుంచి దుబాయ్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. పాక్ తన గగనతలాన్ని మూసివేయడంతో ప్రయాణం సమయం పెరగడంతో పాటు టిక్కెట్ ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ తమ గగనతలం మీదుగా భారత విమాన రాకపోకలపై ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి నిషేధం విధించిన విషయం తెల్సిందే. దీనికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన విమానాలు, భారత గగనతలం మీదుగా ప్రయాణించకుండా బుధవారం అర్థరాత్రి నుంచి మే 23వ తేదీ వరకు నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు ప్రటించింది. 
 
ఈ పరస్పర నిషేధాల కారణంగా హైదరాబాద్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్ తదితర దేశాలకు నడిపే సర్వీసుల షెడ్యూళ్ళలో గురువారం నుంచి మార్పులు చేయాల్సివచ్చింది. పాకస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ విమానాలను ప్రత్యామ్నాయ, సుధీర్ఘ మార్గాల్లో మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటన్నర నుంచి రెండున్నర గంటల వరకు అదనపు సమయం పడుతోంది. పెరిగిన ప్రయాణం దూరం, ఇంధన వ్యయం కారణంగా టికెట్ ధరలపైనా భారం పడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు