కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయడమే లక్ష్యంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే భాజపాకు బంపర్ మెజారిటీ సాధించుకున్నామో అలాగే తెలంగాణలోనూ రాబట్టాలని అమిత్ షా తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మూలమూలన విస్తరించేందుకు విస్తరణ నాయకులను అమిత్ షా రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు అమిత్ షా తెలంగాణలో పర్యటనలు చేసందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం తామేనని ప్రతిచోటా చెబుతూనే, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వున్నది కనుక తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే తమ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను అడుగనున్నారు. మరోవైపు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ రోజురోజుకీ దిగజారుతోంది. దీన్నే అమిత్ షా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.