ఔరంగజేబు పన్నులు, తుగ్లక్ నిర్ణయాలు రద్దు చేస్తాం: భట్టి విక్రమార్క

మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:34 IST)
ఎల్.ఆర్.ఎస్. పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల రక్త మాంసాలను కూడా పీక్కుతింటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పుడు ఈ పన్నులు రద్దు చేస్తామని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు. 

కేసీఆర్ ఔరంగజేబులా ప్రజలపై పన్నులు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన మీడియా సాక్షిగా నిప్పులు చెరిగారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. మరో రెండున్నర సంవత్సరాల తరువాత కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం తథ్యమని భట్టి చెప్పారు. 

మఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై ఏదో ఒక విధంగా పన్నుల భారం మోపి  పేరుతో తన ఖజానా నింపుకోవాలని చూస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. పేద, దిగువ, మధ్య తరగతి ప్రజల రక్తాన్ని పన్నులు రూపంలో తాగేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నాడని భట్టి తీవ్రస్థాయిలో దనుమాడారు.

పేద, మధ్య తరగతి కుటుంబాలవారు బిడ్డల పెళ్లికోసం, పిల్లల చదువుకోసం, భవిష్యత్తుకోసం రూపాయిరూపాయి కూడబెట్టి.. స్థలాన్ని కొనుక్కుంటే..  ఇప్పుడు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తామనడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. ఎల్.ఆర్.ఎస్. పేరుతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన ఎల్.ఆర్.ఎస్. స్కీమ్ హేతుబద్ధంగా లేదని అసెంబ్లీలోనూ, బయట కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కష్టపడి కొనుక్కున్న స్థలాలపై ప్రభుత్వం వాటా తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు.

ప్రజల ఆస్తులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి.. కానీ అందులో వాటాలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని భట్టి నిప్పులు ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. రిజిస్ట్రేషన్ కు ఎల్.ఆర్.ఎస్ కు లింక్ చేయడం దేశంలో ఎక్కడా లేదని బట్టి అన్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు ఎవరికీ లేదని భట్టి చెప్పారు.

ఇప్పటికే ఒకటే ప్లాట్ కు అమ్మకం.. కొనుగోళ్లు జరిగిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ రూపంలో ప్రభుత్వానికి పీజు రూపంలో డబ్బులు చెల్లించి ఉంటారని భట్టి చెప్పారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన స్థలాన్ని మళ్లీ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం నేరమని భట్టి చెప్పారు. 
 
రద్దు చేస్తాం
ఎల్.ఆర్.ఎస్ కు ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదు.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. అప్పుడు దీనిని రద్దు చేస్తామని భట్టి చెప్పారు. అలాగే..  ఇంటి విస్తీర్ణం, ఇతర వివరాలు, పొలాల్లో వేసుకున్న కొట్టాలు విస్తీర్ణం, ట్రాక్టర్లు పెట్టుకోవడానికి వేసుకున్న షెడ్ల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది.

వీటన్నంటిని తమ వద్ద పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అంతేకాక ప్రజల మీద అధిక పన్నులు వేసేందుకు ప్రభుతవం కుట్ర చేస్తోందని బట్టి ఆరోపించారు. ఎల్.ఆర్.ఎస్ కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని బట్టి మీడిమా ముఖంగా ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
అప్పులు కట్టుకునేందుకే..
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇబ్బడిముబ్బడిగా తీసుకువచ్చిన అప్పుల భారాన్ని తీర్చేందుకు ఇప్పుడు ప్రజలను పీక్కుతింటున్నారని అన్నారు. కేసీఆర్ తీసుకువచ్చిన అప్పులు భారం ప్రభుత్వం మీద ఇప్పుడే మొదలైంది.. ఇంక మూడు సంవత్సరాల తరువాత ఎలా ఉంటుందో ఊహించలేమన్నారు.
 
నీళ్లుతాగినా.. గాలి పీల్చినా పన్నులేస్తారు..?
ఆదాయం పెంచుకునేందుకు, మొత్తం రూ. 6 లక్షల కోట్లకు చేరనున్న తెలంగాణ అప్పులు, వడ్డీలు కట్టుకునేందుకు రేప్పొద్దున గాలి పీల్చినా, నీళ్లు తాగినా, గడ్డం పెంచినా, గడ్డం గీసుకున్నా, రోడ్డు మీద మనిషి నడిచినా, ఆఖరుకు స్నానం చేసినా కేసీఆర్ ప్రభుత్వం ప్రజల మీద పన్నులేస్తుందని అన్నారు. గతంలో అప్పుడెప్పుడో ఔరంగజేబు వేసిన జుట్టు పన్నులాంటివి అన్నింటినీ వేస్తారని భట్టి చెప్పారు. 
 
వెట్టిని మళ్లీ తెచ్చేందుకే..!
నిజాం రాజును గుర్తుకు తెచ్చేలా కూడా కేసీఆర్ పన్నులు వేస్తారని భట్టి చెప్పారు. నిజాం ప్రభుత్వంలో పండించిన పంటకన్నా.. పన్నులు అధికంగా వేసేవారు.. వాటిని కట్టలేక.. ప్రజలు భూములను ప్రభుత్వానికి అప్పజెప్పితే.. అంతకు ముందు కట్టాల్సిన పన్ను బాకీ తీర్చేందుకు ప్రజల్ని వెట్టి చాకిరి చేయించారు.

రేపు భవిష్యత్ లో కేసీఆర్ ఇలాగే చేసి ప్రజల్ని వెట్టి చాకిరిక నెట్టేలా చేస్తున్నారని తీవ్రమైన ఆగ్రహంతో చెప్పారు. కేసీఆర్ ది ఫ్యూడల మనస్తత్వమని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు