ఇప్పట్లో ప్రత్యక్ష క్లాసులు లేన్నట్టే.. ఆన్‌లైన్‌లోనే బోధన : తేల్చి చెప్పిన మంత్రి సబిత

మంగళవారం, 29 జూన్ 2021 (10:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల చదువులపై ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో ప్రత్యేక తరగతులు లేనట్టేనని స్పష్టం చేశారు. కేవలం ఆన్‌లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తామన్నారు. 
 
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలను తెరిచే పరిస్థితులు లేకపోవటంతో జూలై 1 నుంచి ఆన్‌లైన్‌ బోధనను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. విద్యార్థులు నష్టపోకుండా గుణాత్మకమైన డిజిటల్‌/ఆన్‌లైన్‌ తరగతులు ఉంటాయని మంత్రి వివరించారు. విద్యాసంస్థల ప్రారంభం, ఆన్‌లైన్‌ తరగతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సోమవారం గన్‌ఫౌండ్రీలోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ క్లాసులపై మంత్రి కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా పాఠాలు వీక్షించవచ్చని, ఇవేవీ లేని విద్యార్థులు గ్రామ పంచాయతీలు, గ్రంథాలయాల్లో పాఠాలు వినేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించనున్నామని తెలిపారు. 
 
టీశాట్‌ పాఠాలు వీక్షించలేని వారికోసం టీశాట్‌ యాప్‌లో, దూరదర్శన్‌ యూట్యూబ్‌ చానల్లో ప్రసారాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎస్సీఈఆర్టీ ద్వారా వర్క్‌షీట్లను సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేసేందుకు 75 వేల వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశామన్నారు. 
 
విద్యార్థులకు అతి త్వరలో పాఠ్యపుస్తకాలను అందజేస్తామని, ఇప్పటికే 90 శాతం పుస్తకాలు స్కూళ్లకు చేరుకున్నాయని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు 50 శాతం ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరవుతూ ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు