Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

దేవీ

గురువారం, 12 జూన్ 2025 (15:29 IST)
Niharika, priyadarshi, allu aravind and others
బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
తాజాగా 'మిత్ర మండలి' టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు(జూన్ 12) ఉదయం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
త్వరలో థియేటర్లలో నవ్వుల పండుగ రాబోతుందని చాటిచెప్పేలా 'మిత్ర మండలి' టీజర్ ఉంది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా పోటాపోటీగా టీజర్ లో నవ్వులు పంచారు. క్రికెట్ తరహా కామెంటరీతో టీజర్ ను వినోదభరితంగా మలిచిన తీరు ఆకట్టుకుంది. "బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు.. రోజూ ఎవరో ఒకర్ని ఎర్రిపప్పని చేస్తారు" అంటూ ప్రధాన పాత్రధారులు ఎలాంటి హాస్యాన్ని పంచబోతున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇక టీజర్ లో వెన్నెల కిషోర్, సత్య మధ్య కామెడీ డైలాగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ 'మిత్ర మండలి' టీజర్.. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ఈ మిత్ర మండలి టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్ స్టర్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్ళిపోయాడు. నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్ గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్." అన్నారు.
 
అతిథి, దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ, "ఈ మిత్ర మండలి చిత్ర దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న బన్నీ వాస్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్." అన్నారు.
 
అతిథి, నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, "ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే. నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి. అరవింద్ గారు ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.
 
చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, "ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయడానికి 'జాతిరత్నాలు' స్ఫూర్తి. ఒక నలుగురు స్నేహితులు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడితే చూడటానికి ఎంత బాగుంటుంది. ఇది యంగ్ స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేము వాళ్ళకి మా వంతు సపోర్ట్ ఇచ్చాము. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ - సత్య ట్రాక్ అదిరిపోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఈ సందర్భంగా అరవింద్ గారికి, అనుదీప్ గారికి, మిత్రుడు ఎస్.కె.ఎన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. అల్లు అరవింద్ గారు మాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరగడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో మా తల్లిదండ్రులు కంటే కూడా అరవింద్ గారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆయన వల్లే మేము ఎదిగాము. సినీ పరిశ్రమలో నేను ఏం సాధించినా దానికి అరవింద్ గారికే కారణం." అన్నారు.
 
చిత్ర నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ, "అల్లు అరవింద్ గారు మా టీజర్ లాంచ్ కి చాలా సంతోషంగా ఉంది. ఆయన రాక మా అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చింది. అలాగే, అనుదీప్ గారు మాకు రైటింగ్ పరంగా ఎంతో సహాయం అందించారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాము." అన్నారు.
 
చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ, "మా టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి, నా మిత్రుడు అనుదీప్ కి, అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. నేను రాసిన కామెడీని నటీనటులంతా తెరమీద అద్భుతంగా పండించారు." అన్నారు.
 
చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ, "టీజర్ మీ అందరికీ నచ్చింది కదా. సినిమా అంతకుమించి ఎన్నో రెట్లు వినోదాన్ని పంచబోతుంది. ఈ సినిమా కథ చాలా బాగుంది. అందుకే ఇంతమంది నిర్మాతలు ముందుకు వచ్చారు. వాసు గారు మా అందరినీ నడిపించారు. మా లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు. విజయ్ లాంటి రచయితలు, దర్శకులు సినీ పరిశ్రమకు రావాలి. ఈ సినిమా థియేటర్లలో మీ అందరినీ నవ్విస్తుందని నమ్ముతున్నాను." అన్నారు.
 
చిత్ర కథానాయిక నిహారిక మాట్లాడుతూ, "ఇంత మంచి సినిమా నా మొదటి తెలుగు చిత్రం కావడం సంతోషంగా ఉంది. టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. వాళ్ళ కామిక్ టైమింగ్ అదిరిపోతుంది. వారందరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి, దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. " అన్నారు.
 
వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'మిత్ర మండలి' చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు