సీఎం చంద్రబాబు ఛాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్

ఐవీఆర్

శనివారం, 15 జూన్ 2024 (13:53 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా వున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. తన ఛాంబర్ పక్కనే డిప్యూటీ సీఎం పవన్ ఛాంబర్ కూడా వుండేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సీఎం ఛాంబర్ లో కేవలం చీఫ్ సెక్రటరీ ఛాంబర్ వుండేది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ రెండింటితో పాటు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఛాంబర్‌ను కూడా తన బ్లాకులోనే ఏర్పాటు చేయిస్తున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటో కూడా వుండేట్లు ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్ కల్యాణ్ కి పటిష్టమైన సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసారు.
 
సచివాలయానికి రోజూ ఉదయం గం. 10లకే సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇకపై ఠంచనుగా ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఆయన అక్కడే సాయంత్రం 6 గంటల వరకు ఉండి రోజువారీ విధులు నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో ఉంచుకున్న ఆయన... గతంలో మాదిరిగానే ఈసారి కూడా సచివాలయం కేంద్రంగా తన పాలన కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే అందుబాటులో ఉంటానంటూ తనను కలిసిన పలువురు ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. గతంలో వ్యవహరించిన విధంగానే ఈసారి కూడా సచివాలయంలోనే నిరంతరం అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించబోతున్నట్టు ఆయన చెప్పారని తెలుస్తోంది.
 
మరోవైపు, సచివాలయం నుంచి పాలన అందించాలని నిర్ణయించన సీఎం చంద్రబాబు కేబినెట్ మంత్రులకు కూడా కీలక దిశానిర్దేశం చేశారు. మంత్రులు ప్రతి రోజూ సచివాలయానికి రావాలని, అదేవిధంగా సమయపాలన ఖచ్చితంగా పాటించాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని, పరిపాలన పరంగా సంపూర్ణ అవగాహన పొందాలని సూచించారు. సచివాలయంలో తనను కలిసేందుకు వచ్చిన మంత్రులకు ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు