"రాజధాని" హైజాక్ క్షమించరాని నేరం: సీఎం నవీన్

బుధవారం, 28 అక్టోబరు 2009 (12:33 IST)
రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును మావోయిస్టులు హైజాక్ చేయడం క్షమించరాని నేరమని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్య తీసుకోవాలని ఆయన బుధవారం అన్నారు.

దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ... రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ కథ సుఖాంతం అయిన తర్వాత ప్రయాణికుల యోగక్షేమాల గురించి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, రైల్వే మంత్రి మమతా బెనర్జీకి తెలియజేసినట్టు చెప్పారు. ఈ అంశాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

అదేసమయంలో మావోయిస్టులపై జాయింట్ ఆపరేషన్ చేపట్టేందుకు సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. మావోయిస్టులను దేశ ద్రోహులుగా, నేరస్తులుగా చిత్రీకరించారు. ప్రతి రోజు జరిగే హింసాత్మక చర్యలకు వారే బాధ్యులన్నారు. ప్రయాణికులను క్షేమంగా విడిపించేందుకు హైజాకర్లతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోనందుకు సంతోషంగా ఉందన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు నేత మహతోను విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో మావోస్టులు మంగళవారం సాయంత్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన విషయం తెల్సిందే. అయితే, మావోల డిమాండ్‌కు బెంగాల్ సర్కారు ససేమిరా అనడం, అదే సమయంలో సాయుధ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో మావోలు తోకముడిచి ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయారు.

వెబ్దునియా పై చదవండి