మాది చదువు విలువ తెలిసిన ప్రభుత్వం.. బుగ్గన రాజేంద్రనాథ్

గురువారం, 20 మే 2021 (16:26 IST)
తమది చదువు విలువ తెలిసిన ప్రభుత్వమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అందుకే ఈ వార్షిక బడ్జెట్‌లో విద్యాశాఖకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బలంగా నమ్ముతారని బుగ్గన అన్నారు. 
 
అందుకే రాష్ట్ర విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి సంబంధించిన కేటాయింపులతో ఈ విషయం అందరికీ అర్థమవుతుంది అన్నారు. 
 
ఓవరాల్ గా బడ్జెట్ లో విద్యా రంగానికి 24,624.22 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. ఇందులో భాగంగా.. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. కాగా గత బడ్జెట్‌లో ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు కేటాంచారు.ఆ బడ్జెట్ ను మరోసారి పెంచారు.
 
విద్యా రంగానికి కేటాయింపులు ఇవే..
విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
 
విద్యారంగంతో పాటు కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో.. కరోనా కట్టడిపైనా ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆ దిశగా కేటాయింపులు చేసింది. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. 
ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు 2,248.94 కోట్లు.. ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు.. కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు.. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున బడ్జెట్ లో కేటాయింపులు చేశారు.
 
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు కూడా సీఎం జగన్ విద్యాశాఖపై ప్రత్యేక ఫోకస్ చేశారు. ఏపీలో పాఠశాలల తీరుపై సీఎం జగన్ రివ్యూ చేశారు. ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష చేసిన ఆయన పలు సూచనలు చేశారు. 
 
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్‌ ఫౌండేషనల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శక ప్రణాళికపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. నాడు-నేడుతో స్కూళ్లు, అంగన్‌వాడీలు అభివృద్ధి అయ్యాయి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి స్కూల్‌ వినియోగంలో ఉండాలని.. కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదన్నారు. 
 
శిక్షితుడైన టీచర్‌ పీపీ-1, పీపీ-2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు. అధికారులు మరోసారి కూర్చొని చర్చించి మరింత మంచి ఆలోచనలు చేయాలని కోరారు. ఈనెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామన్నారు జగన్. బడ్జెట్ లో సైతం విద్యాశాఖపై ప్రత్యేక ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు