ఆంధ్రా ఉద్యోగులకు పూర్తి వేతనం : సీఎం జగన్ ఆదేశం

గురువారం, 21 మే 2020 (16:29 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఏపీ సర్కారు కోత విధించింది. స్థాయిని బట్టి ఈ కోత వుంది. అయితే, ప్రస్తుతం 60 రోజుల లాక్డౌన్ తర్వాత పరిస్థితి మారింది. లాక్డౌన్ ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. షాపులు తెరుచుకుంటున్నాయి. ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసులన్నీ 100 శాతం సిబ్బందితో పని చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 
 
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే చెల్లించింది. గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం, ఐఏఎస్‌లకు 40 శాతం, ప్రజా ప్రతినిధులకు అసలు జీతాలే ఇవ్వలేదు. అయితే లాక్ డౌన్‌లో భాగంగా సడలింపులు చేయడంతో ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చేపట్టారు. 
 
దీంతో ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మే నెల నుంచీ పూర్తి జీతం ఇవ్వాలని ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో సిఎఫ్ఎంఎస్ మార్పులు చేయనున్నది. 
 
గురువారం సాయంత్రం లేదా రేపటికల్లా సిఎఫ్ఎంఎస్‌లో మార్పులు అందుబాటులోకి రానున్నాయి. గడిచిన రెండు నెలల బకాయిలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు