చికెన్ తినిపించి ప్రేమలో పడేశాడు.. వాడుకుని వదిలేశాడు...

మంగళవారం, 3 మార్చి 2020 (13:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ రకాలుగా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు భరోసా ఇచ్చేందుకు వీలుగా స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు బాధితులు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. 
 
తాజాగా ఓ యువతి ప్రేమికుడు చేతిలో మోసపోయింది. ఈ విషయాన్ని స్పందన కార్యక్రమంలో బహిర్గతం చేసింది. తన తోపుడు బండి పక్కనే మరో బండిపై చికెన్ పకోడీ అమ్ముకునే యువకుడు, నిత్యమూ తనకు చికెన్ పెట్టి, ఆపై ప్రేమిస్తున్నానని చెబితే, నమ్మి మోసపోయానని వాపోయింది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన ఓ యువతి 7వ తరగతి వరకూ చదువుకుంది. ఆమె తండ్రి వికలాంగుడు. కుటుంబ పోషణార్థం, ఆడవారి అలంకరణ వస్తువులను తోపుడు బండిపై పెట్టుకుని అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె బండి పక్కనే అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మరో తోపుడు బండిపై చికెన్ పకోడీ వ్యాపారం చేస్తున్నాడు. పక్కనే ఉంటూ స్నేహంగా మెలగడంతో, ఆమె కూడా తరచూ మాట్లాడేది.
 
ఈ క్రమంలో నిత్యమూ పకోడీలు పెట్టిన అతను, ప్రేమిస్తున్నానని చెప్పాడు. పెళ్లాడతానని మభ్య పెట్టాడు. నువ్వు లేకపోతే చనిపోతానంటూ నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా ప్రేమలో పడిపోయింది. ఆమెను పెదకాకానికి తీసుకెళ్లిన అతను, గుడిలో తాళి కట్టి, పెళ్లయి పోయిందంటూ, ఓ గది తీసుకుని కాపురం పెట్టాడు.
 
ఆపై తనకు అప్పులున్నాయంటూ, బాధితురాలి వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను తీసుకెళ్లాడు. రెండు నెలల కాపురం తర్వాత యువతి గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న అతను ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తన భర్తను, అతని తల్లే దాచి పెట్టిందని, ఇప్పుడు మరో పెళ్లి చేయాలని చూస్తోందని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. దీనిపై స్పందించిన అధికారులు, విచారణ జరిపించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు