పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో బీజేపీ : సీపీఎం

ఠాగూర్

బుధవారం, 9 అక్టోబరు 2024 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఖరిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇది రాజకీయంగా చర్చించాల్సిన విషయమన్నారు. 
 
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. దీంతో పవన్ బీజేపీ కాషాయ రాజకీయాలను ఫాలో అవుతున్నారని విమర్శలు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఏమి చెబితే దానికి తగ్గట్లుగా పవన్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి దింపేసి ఆ స్థానంలో పవన్ కల్యాణ్ను కూర్చొబెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీని నాశనం చేసేందుకు పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో వంద రోజుల కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు