శంకుస్థాపనలు సరే.. నిధులెక్కడ.. ఆర్థిక కష్టాల్లో విశాఖ నగరం

సోమవారం, 30 డిశెంబరు 2019 (12:50 IST)
నవ్యాంధ్ర రాజధానిగా విశాఖపట్టణాన్ని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రూ.388 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. 
 
ఇపుడు విశాఖ పరిస్థితి పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. గతంలో చేసిన అప్పులకు వడ్డీలు, అప్పు వాయిదాల కోసం ప్రతీనెలా ఐదు కోట్లు వరకూ చెల్లించాలి. మరోవైపు నగరంలో చేపట్టిన సాధారణ అభివృద్ధి పనులకు సంబంధించి మార్చి నెల నుంచి దాదాపు రూ.120 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జీవీఎంసీ ఆదాయం అంతంత మాత్రం కావడంతో అధికారులు జాగ్రత్తగా నెట్టుకొస్తున్నారు. 
 
రాష్ట్రంలోనే విశాఖకి ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలకు నగరం వేదికగా నిలుస్తుండడంతో ప్రముఖులను ఆకట్టుకునేలా నగరాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తున్నారు. ఇందుకోసం నిరంతరం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం సాధారణంగా మారింది. అయితే జీవీఎంసీ ఆర్థిక పరిస్థితి కొంతకాలంగా దెబ్బతింటూ రావడంతో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. ఆదాయం తగ్గినప్పటికీ వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి అప్పులు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తూవచ్చారు. 
 
అలాగే, చేపట్టిన సాధారణ అభివృద్ధి పనులకు సంబంధించి ఈ ఏడాది మార్చి నెల నుంచి ఇప్పటివరకూ రూ.120 కోట్లు వరకూ బిల్లులు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉండిపోయాయి. ఇవికాకుండా మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తయినప్పటికీ ఎం-బుక్‌ రికార్డు చేయకపోవడంతో ఆ బకాయిలు ఇంకా అదనం. 
 
ఇదిలావుంటే, జీవీఎంసీకి వచ్చే ఆదాయాన్ని పరిశీలిస్తే ఆస్తిపన్ను రూపంలో ఏడాదికి సుమారు రూ.200 కోట్లు, నీటిపన్ను, ఇతర మార్గాల ద్వారా ఖర్చులు పోనూ మరో రూ.40 కోట్లు ఆదాయం మిగులుతుంది. ఈ మొత్తంలోనే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఆదాయంలో మిగిలిన మొత్తం పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయడానికే సరిపోతుంది.
 
ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో గతంలో మాదిరిగానే అభివృద్ధి పనులను కొనసాగించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులు కొత్తగా రూ.388 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయి ఉండగా, కొత్తగా పెద్దమొత్తంలో పనులు ప్రారంభించాలని నిర్ణయించడం జీవీఎంసీ వర్గాలతోపాటు కాంట్రాక్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 
 
వీటిని చేపట్టేందుకు వీలుగా ఇప్పటికే టెండర్లు పిలవడంతోపాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించేశారు. గత వైభవాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జీవీఎంసీ అధికారులు జీవీఎంసీ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా కొత్త పనులకు శ్రీకారం చుట్టారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయిస్తే తప్ప ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు