గోనె సంచుల్లో తెలంగాణ అక్రమ మద్యం

గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:33 IST)
రాష్ట్ర స్థాయిలో స్థాయిలో పాత గోనె సంచుల రిపేరు, విక్రయాలకు ఎస్‌.అన్నవరం ప్రసిద్ధి చెందింది. వివిధ రాష్ట్రాల నుంచి లారీల్లో పాత గోనె సంచులు కొని తేవడం, వాటికి మరమ్మతులు చేసి తిరిగి ఎగుమతి చేయడం దశాబ్దాలుగా జరుగుతున్న వ్యవహారం. దీనిని మద్యం అక్రమ వ్యాపారులు తమకు అనువుగా మలుచుకుని గోనె సంచుల లారీల్లో తెలంగాణ నుంచి లక్షల విలువైన మద్యాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారం గత నవంబరు నెలలో ప్రభు త్వం ఏర్పాటుచేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులతో బట్టబయలైంది. అప్పుడు దొరికిన వ్యాపారిని విచారించగా పలు అంశాలు బయటపడ్డాయి.

దీనిని ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు స్థానిక అధికారులపై విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారణ కావడంతో సీఐ, ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఈ ఽఘటన తర్వాత అప్రమత్తమైన అక్ర మ వ్యాపారులు కొంతమేర గప్‌చుప్‌ అయ్యారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

ఎస్‌ఈబీ ఎస్పీ ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఆకస్మిక దాడులు చేసి తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. ఎస్‌.అన్నవరం శివారు రామకృష్ణ కాలనీలోని గోనెసంచుల గోదాములో 177 అట్టపెట్టెలకి గోనెసంచులు చుట్టి చాటుమాటున భద్రపరిచిన 8496 మద్యం సీసాలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద మొత్తంలో తెలంగాణ మద్యం పట్టుబడడం ఇదే మొదటిసారి అన్నారు. దీని విలువ రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షలు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో రెండు వైన్‌షాపుల వద్ద కొనుగోలు చేసి పోలీసుల కళ్లుగప్పి తుని వరకు తరలించినట్టు గుర్తించామన్నారు.

మద్యం సీసాలు పట్టుబడిన ప్రాంతంలో ఉన్న వ్యక్తి కొట్టె వీరబాబుని అదుపులోకి తీసుకున్నారు. కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు ప్రసాద్‌ చెప్పారు. కాగా భారీ లాభాలకు అలవాటుపడ్డ వ్యాపారులు మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీఎత్తున మద్యం నిల్వ చేస్తున్నట్టు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు