ఏపీ ప్రజలు నాలుగు రాజధానుల్లో స్వాతంత్ర్య వేడుకలు... ఆనందపడాలా? బాధపడాలా?

బుధవారం, 15 ఆగస్టు 2018 (16:58 IST)
అమరావతి : సీఎం చంద్రబాబునాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను బుధవారం ఎగుర వేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడారు. పంద్రాగస్టు భారతీయుల పండగన్నారు. ఈ పండగను అందరమూ గౌరవంగా జరుపుకుందామన్నారు. స్వాతంత్ర్యమొచ్చి 72 ఏళ్లలో దేశం ఎంతో ప్రగతి సాధించిందన్నారు. 
 
అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని శాసనమండలి చైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్ అన్నారు. గతంలో మద్రాసు, కర్నూలు, హైదరాబాద్, ఇపుడు అమరావతిలో... ఇలా నాలుగు రాజధానుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందపడాలో... బాధపడాలో తెలియడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని కొనియాడారు. ఈ ప్రాజెక్టుతో కరవు ప్రాంతమైన రాయలసీమకు ఎంతో మేలుకలుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. చంద్రబాబు లేకుంటే అభివృద్ధి అసాధ్యమన్నారు. 
 
కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రం అభివృద్ధి పథంలో...
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం పోరాడి తన హక్కులను సాధించుకుంటుందన్నారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు, కష్టాలున్నా అభివృద్ధిపథంలో పయనిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ మిరాకిల్ అని కొనియాడారు. 
 
పోలవరం కార్యరూపం దాలిస్తే, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమకు ఎంతో మేలుకలుగుతుందన్నారు. పోలవరంపై లేనిపోని ఆరోపణలు తగవన్నారు. రాజకీయాలకు తావులేకుండా, ప్రజలు, నీటి కోణాల్లో పోలవరం ప్రాజెక్టు గొప్పతనాన్ని చూడాలన్నారు. ప్రజలు, పాలకులు ఐక్యంగా కృషి చేసి, రాష్ట్ర, దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో చట్టసభలు పవిత్రతను కాపాడుతున్నామన్నారు. అసెంబ్లీ ఉద్యోగులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అసెంబ్లీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. 
 
నవ్యాంధ్రప్రదేశ్‌లో నాలుగో స్వాతంత్ర్య దినోత్సం జరుపుకుంటున్నామన్నారు. నదుల అనుసంధానంపై ఇతర రాష్ట్రాలూ దృష్టి సారించాలన్నారు. కుల, మతాలకతీతంగా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవం పవిత్రమైన రోజు అని అన్నారు. ఉగ్రవాదం, రూపాయి పతనం, అధిక ధరలు..ఇలా ఎన్ని సమస్యలున్నా త్వరలోనే ఇండియా అగ్రరాజ్యంగా అవతరించడం ఖాయమన్నారు. 
 
ఏపీలో గ్రామ స్వరాజ్యం వెల్లువిరుస్తోంది...
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్వరాజ్యం వెల్లువిరుస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. పల్లెలే దేశాభివృద్ధి పట్టుగొమ్మలని గాంధీ మహాత్ముడు అన్నారన్నారు. ఆయన బాటలోనే పయనిస్తూ రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో సమస్య అన్నదే లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయలు కల్పిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు దేశ ప్రజలు గర్వించదగ్గదన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యురాలు శమంతకమణి, అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు