మళ్లీ టీడీపీలోకి వెళ్లిపోదామా? వైకాపా మాజీ ఎమ్మెల్యే మంతనాలు

సోమవారం, 4 జనవరి 2021 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఛాన్స్ దొరికితే ఇతర పార్టీల్లో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వైకాపాలోకి వలసలా వచ్చిన నేతల.. ఇపుడు పార్టీలో సముచిత స్థానం దక్కలేదని మథనపడిపోతున్నారు. ఇలాంటి వారంతా తిరిగి తమతమ మాతృపార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌లు అధికార పార్టీలోకి వెళ్తారు. అయితే, ఏపీలో సీన్ రివర్స్ అవుతూ టీడీపీలోకి వైసీపీ నేత డేవిడ్ రాజు వెళ్తున్నారు. వైసీపీలో తనకు సముచిత స్థానం ఇవ్వడం లేదని ఆయ‌న‌ అసంతృప్తితో ఉన్నారు.
 
ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఒంగోలులో తన అనుచరులు, మ‌ద్ద‌తుదారుల‌తో భేటీ అయి టీడీపీలోకి వెళ్లిపోదామా? అన్న విష‌యంపై ప్ర‌శ్నించారు. ఎర్రగొండపాలెం టీడీపీ కార్యకర్తలు ఆయ‌న‌ను ఆ పార్టీలోకి రమ్మంటున్నారని స‌మాచారం. దీంతో వారి విన‌తికి ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిసింది.
 
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఒప్పుకుంటే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని డేవిడ్ రాజు స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. తాజాగా, ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 'ఇప్ప‌టి వ‌ర‌కు నేను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భం లేదు. ప‌దవులు శాశ్వ‌తం కాదు.. ముఖ్యం కాదు.. కానీ, గౌర‌వం అనేది చాలా ముఖ్యం' అన్నారు. తనను క‌లిసేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న మ‌న‌స్తాపంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు