దిశ కాల్ తో నిండు ప్రాణాల్ని కాపాడిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు

గురువారం, 26 ఆగస్టు 2021 (16:30 IST)
నేను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నా... నా కుమార్తెను చేర‌దీయండి! అంటూ ఓ మ‌హిళ దిశ యాప్ నుంచి కాల్ చేసింది. దీనితో పోలీసులు ఆఘ‌మేఘాల‌పై వెళ్లి ఆమెను కాపాడారు. విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 
 
ప్రేమించి, అఖిల్ అనే వ్య‌క్తిని న‌మ్మి వ‌చ్చా... ఇపుడు అత‌ను మోసం చేయ‌డంతో స‌మాజంలో ఒక కుమార్తెతో బ‌త‌క‌లేను ...అంటూ ఈ కాల్ సారాంశం. ప్రేమ పేరుతో నమ్ముకొని వచ్చిన అఖిల్ తనను  మోసంచేయడం తో సమాజంలో ఎదురయ్యే అవమానాలను భరించే ధైర్యం లేక గత్యంతరం లేని పరిస్థితిలో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె కాల్ చేసింది.  తన కుమార్తెను పోలీసులు చేరదీసి ఆదుకోవాలని కోరుతూ అర్థరాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఆ మహిళ దిశ ఎస్.ఓ.ఎస్ సందేశాన్ని అందించింది.
 
దిశ యాప్ ఆధారంగా, పంపిన సమాచారం నెంబరు ఆధారంగా మహిళ ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన దిశ కంట్రోల్ రూం సిబ్బంది హుటాహుటిన విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సకాలంలో స్పందించిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ పోలీసులు కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మహిళ ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే ఆ మ‌హిళ పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళను గుర్తించిన పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. అంతేకాకుండా మహిళ తో పాటు ఉన్న  ఐదు సంవత్సరాల బాలికను చేరదీశారు. అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు