ఓవైసీ ఎప్పుడైనా దీపావళికి, సంక్రాంతికి విందు ఇచ్చాడా?: పరిపూర్ణానంద ప్రశ్న

శనివారం, 11 నవంబరు 2017 (16:42 IST)
రంజాన్ వస్తే హిందువులుగా చెప్పుకునే నాయకులు ఏ పార్టీలో వున్నా వారు టోపీ పెట్టుకుంటారు. ఇఫ్తార్ విందు ఇస్తారు. డిసెంబర్ 25 వస్తే వారు ఫాదర్‌లా బురఖాలు వేయరు కానీ.. అవీ వేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ అందరినీ ఒక్క ప్రశ్న వేస్తున్నా? ఏ ఒక్క మహమ్మదీయ నాయకుడు కానీ, ఓవైసీ ఎప్పుడైనా హిందువులకు దీపావళికి విందు ఇచ్చాడా? చెప్పండి అంటూ పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. 
 
ఒక ముస్లిం లేదా క్రైస్తవ నాయకులు మన పండుగలకు వచ్చి కనీసం పలుకరించిన దాఖలాలున్నాయా? అంటూ అడిగారు. తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పరిపూర్ణానంద.. హిందువులుగా చెప్పుకునే నాయకులు ఇతర మతాలకిచ్చే గౌరవాన్ని, ప్రాధాన్యతను ఎండగట్టారు. క్రైస్తవ నాయకుడు ఎవరైనా దీపావళికో లేదా సంక్రాంతికో మనకు విందులిచ్చారా? ఇవ్వరు.. కానీ మన నాయకులు మాత్రం అక్కడికెళ్లి టోపీలు, బురఖాలేస్తారు. 
 
అదేమిటో తనకు అర్థం కాదు. అన్నీ మతాలు గౌరవించేవారు.. టోపీలు, బురఖాలు వేసుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఎలా వాళ్ల మతాన్ని వారు గౌరవించుకుంటూ.. మా మతం మాకుందని.. అంత నిక్కచ్చిగా వుంటే.. ఈ రాజకీయ నాయకులెందుకు వారి మతాల్లోకి దూరుతారని ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
కేవలం 20 శాతం ఓట్లే రాజకీయ నాయకులను గెలిపిస్తాయనుకుంటే .. 80 శాతం వుండే హిందువులు వద్దనుకుంటే అది తేల్చి చెప్పేయండని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. మనలో ఐక్యత లేకపోవడమే వారికి బలహీనులుగా కనిపిస్తున్నాం.. అదే ఒక్కటై పిడికిలి బిగిస్తే ఎవ్వడైనా దిగి రావలసిందనని పరిపూర్ణానంద  పేర్కొన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు