అభిమానంతో ఓటు వేస్తే ఆ ఎమ్మెల్యే తగిన శాస్తి చేశారు.. మహిళ ఆత్మహత్య లేఖ

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:43 IST)
ఎన్నికల సమయంలో వైకాపా తరపున అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా ఓటు వేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తమకు తగిన శాస్తి చేశారు. తమ ఇంటికి దారి లేకుండా చేశారు. తమకు న్యాయం చేయాలని ఎంత మొత్తుకున్నప్పటికీ అటు అధికారులుగానీ ఇటు పాలకులుగానీ స్పందించలేదు. ఇక తమ చావే శరణ్యమని భావించిన ఆ మహిళ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఈ విషాదకర ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనపర్తిలోని బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో కర్రి అరుణకుమారి (46) అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె భర్త విలేకరిగా పనిచేస్తున్నారు. వారు ఉంటున్న ఇంటికి దారి లేకపోవడంతో కొన్నేళ్లుగా బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాన్ని రహదారిగా వినియోగించుకుంటున్నారు. 
 
ఇటీవల హైస్కూల్‌కు ప్రహరీ నిర్మించడంతో దారి మూసుకుపోయింది. రహదారి మార్గాన్ని ఉంచి మిగిలిన స్థలంలో గోడ నిర్మాణం చేయాలని ఆ ప్రాంత మహిళలంతా స్థానిక ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఆయన కనీసం చెవిన కూడా వేసుకోలేదు. దారిమార్గం మూసివేస్తూ గోడ నిర్మించారు. దీంతో మనస్తాపానికి గురైన అరుణకుమారి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని ఉద్దేశిస్తూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
'ఎమ్మెల్యే గారు.. డబ్బులు ఇస్తామన్నా తీసుకోకుండా మీపై అభిమానంతో ఓటు వేసినందుకు తగిన బుద్ధి చెప్పారు. దారి మూయించి మోసం చేశారు' అని నోట్‌లో పేర్కొంది. 'కాలనీ వాసుల కష్టాలను ఇప్పటికైనా తీర్చాలి. తనలా మరెవరు ఆత్మహత్య చేసుకోవద్దు' అని నోట్‌లో వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు