వరల్డ్ కప్ 2019: విరాట్ కోహ్లీ స్టార్ టీమ్ న్యూజీలాండ్ చేతిలో ఓడిపోవడానికి కారణాలేంటి?

గురువారం, 11 జులై 2019 (19:28 IST)
న్యూజీలాండ్‌ జనాభా దాదాపు 50 లక్షలు. అంటే బెంగళూరు జనాభాలో దాదాపు సగం. న్యూజీలాండ్‌లో ఒక్కో వ్యక్తికి ఉన్న ఏడు గొర్రెలన్నింటినీ కలిపినా, అప్పటికీ ఆ దేశ జనాభా భారతదేశంలోని చాలా రాష్ట్రాల కంటే తక్కువే ఉంటుంది. న్యూజీలాండ్‌లో క్రికెట్ కంటే రగ్బీ ఎక్కువ ఆడతారు. క్రికెట్‌తో పోలిస్తే ఎక్కువ డబ్బు సంపాదించేది, ఎక్కువ మందిని ఆకర్షించేది రగ్బీనే. ఇటు భారత జనాభా 130 కోట్లు, భారత్ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.

 
భారత్‌ ఆటగాళ్లను ఎంపిక చేయడానికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కావల్సినంత డబ్బు, బలం ఉంది. వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ కూడా. న్యూజీలాండ్ భారత్‌ను ఓడించినప్పుడు ఇదంతా ఏకపక్షంగా సాగినట్టు అనిపించింది. భారత్ ఎక్కడా న్యూజీలాండ్‌కు పోటీ ఇచ్చే స్థితిలో కనిపించలేదు. భారత్ దగ్గర స్టార్స్ ఉన్నారు. న్యూజీలాండ్ దగ్గర టీమ్ ఉంది. భారత జట్టు బ్యాక్‌రూం స్టాఫ్ ఒక కార్పొరేట్ ప్రొఫెషనల్ కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అటు న్యూజీలాండ్ దగ్గర ఫిస్కల్ చార్జీలకే డబ్బు లేదు.

 
భారత్‌కు ఎందరో, కివీస్‌కు ఒక్కరే
భారత్‌కు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మంచి బౌలర్లున్నారు. రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. తనొక్కడే ఈ టోర్నీలో 5 సెంచరీలు చేశాడు. న్యూజీలాండ్ దగ్గర ప్రధాన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ మాత్రమే. మొత్తం స్కోరులో మూడొంతుల స్కోరు అతనొక్కడే కొట్టాడు. ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్ల మనోధైర్యం పెంచడానికి భారత అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అటు న్యూజీలాండ్ కామెంటరేటర్ మైదానంలో ఉన్న తమ ఫ్యాన్స్‌ను పేర్లు పెట్టి పిలవగలడు.

 
రెండు టీముల మధ్య ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ న్యూజీలాండ్ మ్యాచ్ గెలిచింది. ఆటంటే అదే. భారత్ ఓటమి గురించి పోస్ట్‌మార్టం మొదలవుతుంది. బహుశా ముఖం దాచుకుంటారు, ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటారు. భారత్ చెత్తగా ఆడలేదు కానీ, తెలివితక్కువగా ఆడింది. రెండు అద్భుతమైన బంతులకు ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఔటయ్యారు. మొదట ఈ మ్యాచ్‌కు ముందు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ. తర్వాత ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత 12వ ఓవర్ మొదట్లోనే భారత్ ఆట ముగిసింది.
 
అయితే, రవీంద్ర జడేజా ఉన్నంతవరకూ భారత్ పోటీలో నిలిచింది. వికెట్ కాపాడుకుని ఆడుతున్న ధోనీ కూడా జడేజా వెళ్లిపోగానే ఒక అద్భుతమైన త్రోకు రనౌట్ అయ్యాడు. ధోనీ వెళ్లిపోయిన తర్వాత ఇంకేం మిగల్లేదు. జడేజాతో 116 పరుగుల భాగస్వామ్యంలో ధోనీ 45 బంతుల్లో 32 రన్స్ చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన జడేజా 59 బంతుల్లో 77 రన్స్ చేసాడు. ఈ భాగస్వామ్యంలో 20 బంతులకు ఎలాంటి పరుగూ రాలేదు. చివరి మూడు ఓవర్లలో విజయం కోసం 37 పరుగులు చేయాల్సొచ్చింది. కానీ, భారత్ ఆటను చూస్తుంటే లక్ష్యం వరకూ చేరుకోలేదేమో అనే సందేహం కలిగింది.

 
తెలివిగా ఆడలేదు
ఇదెలాంటి మ్యాచ్ అంటే, దీనిలో న్యూజీలాండ్ గెలవలేదు, భారత్ ఓడిపోలేదు. విలియమ్స్ వికెట్‌ను చాలా బాగా అంచనా వేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే బ్యాటింగ్‌లో సాహసాలకు వెళ్లలేదు, ప్రయోగాలు చేయలేదు. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని తెలుసుకున్నాడు. అయితే, భారత్‌కు 240 పరుగులు అంటే పెద్ద స్కోరేం కాదు. కానీ, న్యూజీలాండ్ ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్ తమ బౌలింగ్‌తో 240 పరుగులు చేయడం అంత సులభం కాదని నిరూపించారు. వారితోపాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచ్ శాంట్నర్ భారత మిడిలార్డర్ పని ముగించాడు. న్యూజీలాండ్ ప్రపంచ కప్ గెలుచుకునే ఆటతీరు ప్రదర్శించింది. ఇప్పుడు భారత్ దీనికోసం మరో నాలుగేళ్లు వేచిచూడాల్సుంటుంది.

 
చెత్త సెలక్షన్
భారత్ ఈ టోర్నీకోసం ప్రధానంగా మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్, చివరి ముగ్గురు బౌలర్లను ఎంపిక చేసింది. వాళ్లు నిజంగా ప్రపంచ స్థాయి ఆటగాళ్లే. కానీ మధ్యలో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు. జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ మొదటిసారి ప్రపంచకప్ ఆడారు. టాప్ త్రీ బ్యాట్స్‌మెన్ భారత్ మొత్తం స్కోరులో మూడింట రెండు వంతుల పరుగులు చేశారు.
 
ప్రపంచకప్‌లో ఏ జడేజాను నిర్లక్ష్యం చేశారో, అతడు సెమీస్‌లో చివరి వరకూ భారత్‌లో ఆశలు రేపాడు. ఈ టోర్నీ కోసం భారత్ ఆటగాళ్లను సరిగా ఎంపిక చేయలేదు. సెలక్టర్లు 4వ నంబర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతకలేకపోయారు. భారత్ గత ప్రపంచకప్‌ నుంచి 4, 7 నంబర్ కోసం 24 మంది ఆటగాళ్లను తీసుకుంది. ఇక్కడ ప్రతిభకు లోటు లేదు, ఎంపికలో నిర్ణయం తీసుకోవడంలో లోటు కనిపించింది.

 
భారత్ న్యూజీలాండ్‌ను లైట్ తీసుకుందా?
భారత అభిమానులు, మీడియాతోపాటు కామెంట్రీ బాక్సులో ఆర్భాటం చేసేవారు అలా కచ్చితంగా అదే చేశారు. కానీ ఆటగాళ్లు దాన్ని ఎలా తీసుకున్నారు. మొదటి రోజు వర్షం వల్ల మ్యాచ్ ఆగినప్పుడు న్యూజీలాండ్ 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. వర్షం వల్ల మిగతా మ్యాచ్ తర్వాత రోజు అంటే బుధవారం జరిగింది. తర్వాత రోజు న్యూజీలాండ్ 23 బంతుల్లో 28 పరుగులు చేసింది. దీన్ని చూసి భారత్‌కు బ్యాటింగ్ బహుశా సులభంగా ఉంటుందేమో అనిపించింది. చివరికి బలహీనమైన మిడిలార్డర్‌ వల్ల భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

 
తరచూ లాజిక్ లేకుండా ఒకే దానికి కట్టుబడితే ఎప్పుడూ విజయవంతం కాలేం. దీని ఫలితమే న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించింది. అన్ని బలాలు ఉన్నా న్యూజీలాండ్ ముందు భారత్ తలవంచినట్టు అనిపించింది.
 
-సురేశ్ మీనన్
సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు