పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఒకటి పాకిస్థాన్కు ఇచ్చే సింధూ నదీ జలాలను నిలిపివేయడం. దీంతో పాకిస్థాన్లో నీటికి కటకట ఏర్పడింది. ముఖ్యంగా, రెండు ప్రధాన డ్యాముల్లో నీటి నిల్వలు సగానిపైగా పడిపోయాయి. ఈ కారణంగా తాగు, సాగునీటితో పాటు ఖరీఫ్ సీజన్పై తీవ్ర ప్రభావం పడుతుంది. భారత్ చర్య ఏకపక్షమని, చట్టవిరుద్ధమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదంతో పాకిస్థాన్నే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ గట్టిగా వాదిస్తోంది.
భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్లోని కీలకమైన మంగ్లా, తర్బేలా డ్యాముల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఇది ఖరీఫ్ సీజన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రెండు డ్యామ్లు పాకిస్థాన్ పంజాబ్, సింధ్ ప్రావీన్స్లలో అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ డ్యామ్లలోని నీటితో జలవిద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అలాగే, వ్యవసాయానికి కూడా అత్యంత కీలకంకానుంది.
పాకిస్థాన్ మొత్తం నీటి ప్రవాహంలో 21 శాతం కొరతను, రెండు కీలక డ్యామ్లలో దాదాపు 50 శాతం నీటి నిల్వల కొరతను ఎదుర్కొంటోంది. భారత్ నుంచి చీనాబ్ నది ప్రవాహాలు అకస్మాత్తుగా తగ్గడం వల్ల ఖరీఫ్ సీజన్ ఆరంభంలో నీటి కొరత మరింత పెరుగుతుందని ఐఆర్ఎస్ ఏ ఆందోళన వ్యక్తం చేసింది.