కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లైఫ్ సపోర్టుతో జీవిస్తూ, వైద్యం చేస్తున్నా కోలుకోలోని రోగులు గౌరవంగా చనిపోయే హక్కు (కారుణ్య మరణం)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ హక్కును ప్రసాదించే ముందు రెండు దశల్లో మెడికల్ రివ్యూ ఉంటుంది.
ప్రాథమిక బోర్డులోని ముగ్గురు వైద్యులు రోగి పరిస్థితిని పర్యవేక్షిస్తారు. అంతేమంది వైద్యులతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యుడితో కూడిన సెకండరీ బోర్డు కోర్టుకు నివేదిక సమర్పించడానికి మొదటి బోర్డు గుర్తించిన అంశాలను పరిశీలిస్తుంది. ఆ నివేదికను పరిశీలించిన కోర్టు కనుక అంగీకరిస్తే వైద్య నిపుణుల పర్యవేక్షణలో రోగి లైఫ్ సపోర్ట్ను తొలగించి అతడు ప్రశాంతంగా చనిపోయే అవకాశం కల్పిస్తారు.
అయితే, సంబంధిత రోగి బంధువులు కోరిన మీదటే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కోలుకోలేని రోగులకు దీర్ఘకాలిక బాధల నుంచి విముక్తి కల్పించడంపై దృష్టి పెట్టిన సుప్రీంకోర్టు.. ఇలాంటి వారికి గౌరవప్రదంగా చనిపోయే హక్కును కల్పించాలని ఆదేశించింది.