నాన్ హాట్ స్పాట్ ఏరియాల్లో ఆంక్షలు సడలింపు - తొలి వైరాలజీ ల్యాబ్

గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:57 IST)
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది వచ్చే నెల మూడో తేదీ వరకు అమల్లోవుండనుంది. ఈ లాక్‌డౌన్ అన్ని ప్రాంతాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఇచ్చింది. 
 
ముఖ్యంగా, స్టేషనరీ, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపింది. పిండి మిల్లులు, మొబైల్ రీచార్జ్ షాపులను లాక్‌డౌన్ నుంచి మినహాయిస్తున్నామని చెప్పింది.
 
అలాగే, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సిమెంట్ యూనిట్లకు కూడా మినహాయింపును ఇస్తున్నట్టు తెలిపింది. 
 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టిని సారిస్తున్నామని... పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామని తెలిపింది. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలియా శ్రీవాస్తవ వెల్లడించారు. హాట్ స్పాట్ కేంద్రాల్లో మాత్రం మినహాయింపులు ఉండవని ఆమె స్పష్టం చేశారు. 
 
తొలి వైరాలజీ ల్యాబ్ 
మరోవైపు దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని, ఎనిమిది ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. 
 
కాగా, ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను డీఆర్డీవో తయారు చేసింది. ఈ ల్యాబ్ కరోనా పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు