ఈగల బెడదతో వాటర్ ట్యాంక్ ఎక్కిన గ్రామస్థులు

గురువారం, 10 ఆగస్టు 2023 (15:54 IST)
సమాజంలో అక్కడక్కడా కొన్ని విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి అపుడపుడూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఓ విచిత్ర సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈగల బెడద తట్టుకోలేక ఒక గ్రామ ప్రజలు వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని హర్దోయీ జిల్లా కుయ్య గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన ప్రజలు ఈగల బెడదను తట్టుకోలేక వాటర్‌ట్యాంక్‌ ఎక్కారు. ఈ గ్రామంలో కోళ్లఫారం ఉన్న కారణంగా ఈగల బెడద పెరిగి.. గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో గ్రామంలో పెళ్లిళ్లు కూడా జరగడం లేదు. జరిగినా కొత్తకోడళ్లు గ్రామం విడిచి వెళ్తున్నారు. 
 
అలాగే, బంధువుల రాకపోకలు ఆగిపోయాయి. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు కొందరు గ్రామస్థులు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని గంటల తరబడి చర్చించాక గ్రామస్థులు కిందికి దిగారు.
 
బాలికను బతికిస్తానని పేడ కప్పి, వేపకొమ్మలతో పూజలు 
 
ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ మంత్ర, తంత్రాల వైద్యాలపై జనం నమ్మకాలు తగ్గట్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌ జిల్లా థానాకాంట్‌ సమీప గ్రామంలో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనం. మంగళ్‌సింగ్‌ కుటుంబం ఆదివారం రాత్రి తమ గుడిసెలో నిద్రపోతుండగా.. ఆరేళ్ల కుమార్తెను పాటు కాటేసింది. కుటుంబసభ్యులు ఆ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించకుండా భూతవైద్యం ద్వారా కాపాడేందుకు ప్రయత్నించారు. 
 
పరిస్థితి విషమించాక ఆఖరులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు షాజహాన్‌పుర్‌ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా.. ఆమె బతికే ఉందని భూతవైద్యుడు నమ్మబలికాడు. ఆవు పేడను శరీరంపై కప్పమని.. చుట్టూ వేపకొమ్మలను ఉంచమని చెప్పాడు. ఈ పూజల సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని, మంగళ్‌సింగ్‌ కుటుంబానికి నచ్చజెప్పి.. అంత్యక్రియలకు ఏర్పాట్లుచేయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు