అయోధ్యలో మసీదు స్థలం మాది: కోర్టుకెళ్లిన అక్కాచెల్లెళ్లు

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:35 IST)
ఆయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంపై తాజాగా వివాదం నెలకొంది. ఆ స్థలం తమదంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గురువారం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈనెల 8న విచారణ చేపట్టే అవకాశం ఉంది.

1947లో దేశ విభజన సమయంలో తమ తండ్రి గ్యాన్‌చంద్ర పంజాబ్‌ నుంచి వలస వచ్చి ఫైజాబాద్‌(అయోధ్య) జిల్లాలో స్థిరపడ్డారని రాణి కపూర్‌ అలియాస్‌ రాణి బలుజా, రమా రాణి పంజాబి అనే ఇద్దరు సోదరీమణులు తమ రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ సమయంలో నాజుల్‌ డిపార్ల్‌మెంట్‌ వారు తమ తండ్రికి ధన్నీపూర్‌ గ్రామంలో 28 ఎకరాల భూమిని ఐదేళ్ల పాటు కేటాయించారని, అనంతరం ఆయన పేరును రెవెన్యూ రికార్డుల్లో కూడా చేర్చారని కోర్టుకు తెలిపారు.

అయితే తరువాత తమ తండ్రి పేరును రికార్డుల నుంచి తొలగించారని, దీనిపై ఆయన ఆయోధ్య అడిషనల్‌ కమిషనర్‌ను ఆశ్రయించినట్లు చెప్పారు. కన్సాలిడేషన్‌ చర్యల్లో భాగంగా అధికారి మరళా తమ తండ్రి పేరును తొలగించగా, దీనిపై సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ ముందు అప్పీల్‌ చేశామని కోర్టుకు తెలిపారు.

అయితే ఈ పిటిషన్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా ఈ 28 ఎకరాల్లోని ఐదు ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించారని ఇద్దరు సోదరీమణులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకూ భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డుకు బదిలీ చేయకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

వివాదాస్పద స్థలం హిందువులకే దక్కుతుందని చెప్పిన కోర్టు మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని యుపి ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ మేరకు ఆయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌కు 5 ఎకరాల స్థలం కేటాయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు